కరోనా ఎఫెక్ట్: ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ కలుషిత నగరాలివే, మనదేశంలోనే 2
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ కారణంగా ప్రపంచంలో కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు తీస్తున్న ఈ కరోనా కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని నగరాల్లోనూ వాయు కాలుష్యం లేకుండా పోయింది.
దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు.

ఊపిరిపీల్చుకుంటున్నాయి..
ప్రపంచంలో కాలుష్య నగరాల జాబితాలో మనదేశంలోని పలు నగరాలకు కూడా చోటు దక్కింది. ప్రస్తుతం ఆ నగరాల్లో కూడా ప్రజలు స్వచ్ఛమైన గాలి పీలుస్తుండటం గమనార్హం. మనదేశంలోనే కాదు ప్రపంచంలోని పలు కాలుష్య నగరాల్లో కూడా లాక్ డౌన్ కారణంగా స్వచ్ఛంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ప్రకారం.. 0-50 ఏక్యూఐ పాయింట్లు ఉంటే మంచి(కాలుష్యం లేని)దిగా, 51-100గా ఉంటే మోడరేట్(మోస్తారు)గా, 101-150 వరకు ఉంటే అన్ హెల్తీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్ గా, 151-200 మధ్య ఉంటే అన్ హెల్తీ, 201-300 ఉంటే వెరీ అన్ హెల్తీ, 300పైగా ఉంటే ప్రమాదకర స్థాయిగా పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోనే కలుషితగా ఉన్న నగరాలు ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి.

ఘజియాబాద్, ఇండియా
ఘజియాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, కోవిడ్-19 కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండటంతో ఈ నగరంలో కాలుష్యం పూర్తిగా తగ్గిపోయింది. మార్చిలోనే లాక్ డౌన్ ప్రారంభం కాగా, ఏప్రిల్ 8 నాటికి ఘజియాబాద్ నగరం మోడరేట్(83తో) జాబితాలోకి చేరుకోవడం గమనార్హం. మార్చి 22న జనతా కర్ప్యూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లాక్ డౌన్ అమల్లోకి తెచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా రవాణాతోపాటు పలు పరిశ్రమలు మూతపడిన విషయం తెలిసిందే. కాలుష్యం తగ్గడంతో గాలి కూడా స్వచ్ఛంగా మారింది.

హోటన్, చైనా
కరోనావైరస్ చైనాలోని వూహాన్ నగరంలోనే పుట్టిన విషయం తెలిసిందే. వైరస్ కారణంగా అక్కడ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో చైనాలో పలు నగరాల్లో చైనా కూడా లాక్ డౌన్ ప్రకటించింది. చైనాలోని హోటన్ నగరం కూడా ఇంతకు ముందు ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో ముందు వరుసలోనే ఉంది. అయితే, లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ నగరంలో కూడా కాలుష్యం దాదాపు లేకుండానే పోయింది. మార్చి 11న ఏక్యూఐ 1700 ఉండగా.. ఏప్రిల్ 8 నాటికి 152-273 స్థాయికి చేరుకుంది. దీంతో అక్కడ స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నారు.

గుజ్రాన్వాలా, పాకిస్థాన్
కరోనా బారిన పడిన దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉంది. ఇక్కడ 4వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశ ప్రధాని ప్రజలంతా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలంటూ హెచ్చరించారు. ఎవరికి వారు నియంత్రణ ఉండాలన్నారు. కాగా, పాకిస్థాన్ లోని గుజ్రాన్వాలా కూడా ప్రపంచంలోని కలుషిత నగరాల జాబితాలో టాప్-5లోనే ఉంది. గుజ్రాన్వాలాలో కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో ఇక్కడ లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో కాలుష్యం క్రమంగా తగ్గిపోయింది. ఈ నగరం కూడా అత్యంత కలుషితం నుంచి ఈ నెల రోజుల వ్యవధిలోనే మోడరేట్ స్థాయికి చేరుకుంది.

ఫైసలాబాద్, పాకిస్థాన్
పాకిస్థాన్లో మరో అత్యంత కలుషిత నగరం ఫైసలాబాద్. కరోనా ప్రభావం ఇక్కడ కూడా ఉండటంతో లాక్ డౌన్ అమలు అమలవుతోంది. వందలాది మంది క్వారంటైన్లలో ఉంటున్నారు. కాగా, ఇక్కడ కూడా లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి గాలి నాణ్యతలో మెరుగుదల ఏర్పడింది. 2019లో 104.6 ఏక్యూఐ ఉండగా.. ఈ బుధవారం నాటికి 72కు చేరింది.
Recommended Video

ఢిల్లీ, ఇండియా
భారత రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యం గురించి చెప్పనవసరం లేదు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఇటీవల కాలుష్యం కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ఘటనలు కూడా ఉన్నాయి. 2019లో ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ సగటు ఏక్యూఐ 98.6తో 5వ స్థానం దక్కించుకుంది. కాగా, కరోనావైరస్ ప్రభావం దేశ రాజధానిలో కూడా ఎక్కువగానే ఉండటంతో ఇక్కడ లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో ఢిల్లీలో కాలుష్యం బాగా తగ్గిపోయింది. దీంతో ఢిల్లీ ప్రజలు చాలా కాలం తర్వాత స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. దేశంలో వాహనాలు నడవకపోవడం, పరిశ్రమలు మూత పడటంతో దేశంలోనూ కాలుష్యం భారీగా తగ్గిపోయింది. గంగా నది కూడా కలుషితం లేకుండా కనిపిస్తోందని పరివాహక ప్రాంతాల ప్రజలు అంటున్నారు. ఇక పంజాబ్ రాష్ట్రంలోన జలంధర్ నుంచే అక్కడ ప్రజలు హిమాలయ పర్వతాలను చూసే అవకాశం కూడా లభించడం గమనార్హం. కాలుష్యం కారణంగా వారికి ఇప్పటి వరకు హిమాలయ పర్వతాలు కనిపించేవికావు.












Click it and Unblock the Notifications