రెజ్లర్లతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చలు- రెజ్లింగ్ సమాఖ్యకు మహిళా ఛీఫ్ సహా 5 డిమాండ్లు..
ఢిల్లీలో గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్ల విషయంలో కేంద్రం ఒక్కో మెట్టూ దిగుతోంది. ఇవాళ రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించిన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్.. వారితో భేటీ అయ్యారు. రెజ్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ చర్చల్లో రెజ్లర్లు ఆయన ముందు మొత్తం ఐదు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. వీటి సాధ్యాసాధ్యాలపై ఇరువురూ చర్చిస్తున్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐ ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు ఇవాళ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు ఐదు కీలక డిమాండ్లు పెట్టారు. ఇందులో ప్రధానంగా రెజ్లింగ్ సమాఖ్యకు మహిళా ఛీఫ్ ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు మరికొన్ని సంస్కరణలను వారు సూచిస్తున్నారు. వీటిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆందోళనలు విరమించేందుకు సిద్ధమని వారు చెప్తున్నారు.

తాజాగా రెజ్లర్లతో రెండు రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా భేటీ అయి కొన్ని హామీలు ఇచ్చారు. అనంతరం వారు రైల్వేలో తమ విధుల్లో చేరారు. ఇప్పుడు కేంద్ర క్రీడల మంత్రితో చర్చలలో వచ్చే పురోగతి ఆధారంగా రెజ్లర్లు తదుపరి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా బ్రిజ్ భూషణ్ ను రెజ్లింగ్ సమాఖ్య ఛీఫ్ పదవి నుంచి తొలగించి అరెస్టు చేయడం వంటి డిమాండ్లు కూడా క్రీడామంత్రి ముందు పెట్టారు. అయితే దీనిపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం వేచి చూస్తోంది.












Click it and Unblock the Notifications