రేపు రాష్ట్రానికి యశ్వంత్ సిన్హా.. టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ నేతలతో భేటీ
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్ రానున్నారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తోంది. 2న ఉదయం 11.30 గంటలకు యశ్వంత్ సిన్హా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.

జలవిహార్ లో జులై 2న నిర్వహించే యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పరిశీలించారు. యశ్వంత్ సిన్హా పర్యటన షెడ్యూల్ను ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు. జులై2న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు యశ్వంత్ సిన్హా చేరుకుంటారని తెలిపారు. అక్కడ సీఎం కేసీఆర్, మంత్రులు, పలువురు ముఖ్య నాయకులు యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి జలవిహారం వరకు భారీ బైక్ ర్యాలీతో ఊరేగింపుగా యశ్వంత్ సిన్హాను తీసుకురానున్నారు.
జలవిహార్లో సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత యశ్వంత్ సిన్హా మాట్లాడుతారని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. జలవిహార్లో సభ ముగిసిన తర్వాత యశ్వంత్ సిన్హా కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలతో విడివిడిగా సమావేశం కానున్నారు. సమావేశం ముగిసిన అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకు బయల్దేరుతారు. జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications