మాజీ సీఎంకి ఎంతటి గతి.. కోర్టులోనే భోరుమని ఏడ్పు..!
అధికారంలో ఉన్నప్పుడు చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో గానీ.. ఒక్కసారి పదవి నుంచి పక్కకు తప్పుకున్నాక గతంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాల్సిందే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప. అధికారంలో ఉన్నప్పుడు గనుల కేటాయింపులకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్ప ప్రస్తుతం ఇదే విషయంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే.. విచారణ నిమిత్తం సీబీఐ కోర్టుకు హాజరైన యడ్యూరప్ప, సీబీఐ వేసిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరై పోయి భోరున ఏడ్చినట్టుగా సమాచారం. విచారణలో భాగంగా రెండున్నర గంటల వ్యవధిలో మొత్తం 475 ప్రశ్నలు ఎదుర్కొన్న యడ్యూరప్పకు సీబీఐ ప్రశ్నలు దిమ్మ తిరిగేలా చేశాయట. దీంతో ఏం చెప్పాలో తోచక తానే తప్పు చేయలేదని, దయచేసి తనను ఇబ్బందిపెట్టవద్దని సీబీఐ ని వేడుకున్నట్టుగా తెలుస్తోంది.
కాగా.. యడ్యూరప్ప అధికారంలో ఉన్నప్పుడు గనుల కేటాయింపు విషయంలో తమ కుటుంబ సంస్థ అయిన ప్రేరణా ట్రస్గ్ కు రూ.20 కోట్ల ముడుపులు అందాయనేది ఆయనపై ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ జరిపిన లోకాయుక్త సీబీఐ కి నివేదిక అందజేసింది. దీంతో సీబీఐ ఇప్పుడు నిజా నిజాలను నిగ్గు తేల్చే పనిలో పడింది. ఇక ఇప్పుడు ఏడ్చినా..! ఎంతగా అరిచినా..! యడ్యూరప్పది అరణ్య రోదనే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.