అది నకిలీ ఆడియో: నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం: ప్రతిపక్ష నేత యడ్యూరప్ప
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ చేస్తోన్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయా?, అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయడానికి బీజేపీ నాయకులు వెనుకా ముందూ చూడకుండా అడుగు పెట్టడం అసలుకే ఎసరు తెచ్చి పెడుతోందా? పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలను కర్ణాటకలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
తాజాగా కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిణామాలు దీనికి అవుననే సమాధానమే ఇస్తున్నాయి. కర్ణాటక యాద్గిర్ జిల్లా గుర్మిట్ కల్ కు చెందిన జేడీఎస్ శాసన సభ్యుడు నాగనగౌడకు ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప 50 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లుగా భావిస్తోన్న ఆడయో టేపులు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఆడియో టేపులను స్వయానా ముఖ్యమంత్రి కుమారస్వామి విలేకరుల సమావేశంలో విడుదల చేయడం సంచలనం రేపింది.
విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న నాగనగౌడ కుమారు శరణ గౌడ బేరసారాల వివరాలను పూస గుచ్చినట్టు వివరించారు. ఈ ఘటనతో కర్ణాటక బీజేపీ నాయకులు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయారు. ఆడియో టేపులు నకిలీవని చెప్పుకొంటున్నారు. ఆ ఆడియోలో మాట్లాడినది తానేనని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని యడ్యూరప్ప సవాలు విసిరారు.
ముఖ్యమంత్రి కుమారస్వామి విలేకరుల సమావేశం ముగిసిన వెంటనే యడ్యూరప్ప కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. బెంగళూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కుమారస్వామి చేసిన ప్రకటనలను ఖండించారు. ఆడియో టేపులు నకిలీవని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు బలం లేదనే విషయాన్ని అంగీకరిస్తున్నామని, అంతే తప్ప సంకీర్ణ కూటమిని అస్థిరపర్చడానికి తాము ప్రయత్నాలేవీ చేయట్లేదని వివరణ ఇచ్చుకున్నారు.
ఇలాంటి నకిలీ టేపులను సృష్టించడంలో, వాయిస్ రికార్డ్ చేయడంలో కాంగ్రెస్-జేడీఎస్ నాయకులు సిద్ధ హస్తులని, ఈ విషయంలో వారు ఎక్స్ పర్ట్ లంటూ యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. బీజేపీ శాసన సభ్యుడు సుభాష్ గుత్తేదార్ తో కాంగ్రెస్-జేడీఎస్ నాయకులు ఫోనులో మాట్లాడి, బేరం పెట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుభాష్ గుత్తేదార్ సంఘటనను మరిచిపోయారా? అంటూ ఎదురుదాడి చేశారు. సుభాష్ గుత్తేదార్ తో స్వయంగా కుమారస్వామి మాట్లాడి, పార్టీ ఫిరాయిస్తే మంత్రి పదవి ఇస్తానని ఆశ పెట్టలేదా? అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ముంబైలో ఎక్కడో ఉన్నారని, వారితో తనకేంటి సంబంధం అని యడ్యూరప్ప చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే తాను బాధ్యుడిని ఎలా అవుతానని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే.. అని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.
బీజేపీకి చెందిన నలుగురు శాసన సభ్యులు తమతో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, ముందు కుమారస్వామి దీనికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ నలుగురు శాసనసభ్యులను ఏం చేశారని ప్రశ్నించారు. తాను జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ, ఆయన కుమారుడు శరణ గౌడతో మాట్లాడినట్లు కట్టుకథ అల్లారని ఆరోపించారు. తాను నాగనగౌడతో ఫోన్ ద్వారా సంభాషించినట్టు చెబుతున్న సమయంలో తాను ఓ దేవస్థానానికి వెళ్లానని, శుక్రవారమే బెంగళూరుకు చేరుకున్నానని యడ్యూరప్ప చెప్పారు.