‘ఒకే ఒక్కడు’.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, వరుసగా సంచలన నిర్ణయాలు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ఒకే ఒక్కడు’ సినిమాను గుర్తుకు తెస్తున్నారు. సీఎం అయిన 75 గంటల్లోనే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
లక్నో: ఒకే ఒక్కడు.. ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది శంకర్ దర్శకత్వంలో అర్జున్ కథానాయకుడుగా నటించిన చిత్రం. అందులో అనుకోకుండా ఒక్కరోజు ముఖ్యమంత్రి అవుతాడు అర్జున్. అంతే - ఆ తరువాత అధికారులను పరుగులు పెట్టిస్తాడు. ప్రజా క్షేమమే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాడు.
ఆ.. అదంతా సినిమాల్లోనే.. బయటెక్కడ జరుగుతుందీ అనుకుంటాం కానీ.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అదే జరుగుతోంది. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎంగా బాధ్యత చేపట్టిన 75 గంటల్లో.. అంటే దాదాపు మూడు రోజుల్లోనే ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలు ఒకసారి చూద్దాం.
దాదాగిరిపై ఉక్కుపాదం...
ఉత్తరప్రదేశ్ ను గూండాలు, అరాచక శక్తులు, దుర్మార్గులు లేని రాష్ట్రంగా మారుస్తానని సీఎం యోగి ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే ఆ రాష్ట్రంలోని గూండాలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ జావేద్ అహ్మమద్ ను ఆదేశించారు. అంతే.. ప్రక్షాళన పర్వం మొదలైంది. రైడీలు, గూండాలు, అక్రమ దందా చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తలమునకలయ్యారు.
యాంటీ రోమియో స్క్వాడ్..
ఒంటరిగా వెళ్లే యువతులు, మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు సీఎం యోగి ‘యాంటీ రోమియో స్క్వాడ్' ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏర్పాటు అయ్యాక మహిళలను వేధించే వారి తాట తీస్తున్నారు యూపీ పోలీసులు. దీనిపై అక్కడి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. అందరూ కొత్త సీఎం యోగిని మెచ్చుకుంటున్నారు.
క్లీన్ అండ్ గ్రీన్, నో పాన్.. నో గుట్కా
పరిసరాల పరిశుభ్రతకు సీఎం యోగి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన మంత్రులకు, పోలీసులకు దీనిపై పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో.. పని వేళల్లో పాన్, గుట్కా తినకూడదని ఆదేశాలు జారీ చేశారు.
దొంగలపై పోలీస్ కొరడా...
ఉత్తరప్రదేశ్ లో పెరిగిపోతున్న దొంగతనాలను అరికట్టేందుకు కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో 2015 సంవత్సరంలో 49,491 దొంగతనం కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక గస్తీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సత్వర పరిష్కారానికి ట్వీట్స్...
సమస్యల పరిష్కారానికి, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు సీఎం యోగి చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా సమస్యపై బాధితులకు న్యాయం జరగకుంటే తనకు నేరుగా ట్వీట్ చేయాలని కోరారు. సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి వెళతాయనే సరికి అధికారులు కూడా మరింత అప్రమత్తం అయ్యారు. ఇలా ట్వీట్ చేసిన ఓ బాధితురాలికి సమస్యను అధికారులు గంటల వ్యవధిలో పరిష్కరించారు కూడా.
మంత్రులూ ఆస్తులు వెల్లడించాల్సిందే...
అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, పాలనలో మరింత పారదర్శకతను తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి యోగి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోని ఉన్నతాధికారులు సైతం తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని తాజాగా ఆదేశించారు.
నిజంగానే ఒకే ఒక్కడు సినిమాలో మాదిరిగా యూపీ కొత్త సీఎం యోగి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి సీఎం అయి మూడు నాలుగు రోజులు కాలేదు... అప్పుడే పలు కీలకమైన, సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆ పదవికి ఉన్న శక్తి ఏమిటో ప్రజలకు చూపిస్తున్నారు. మరి మున్ముందు ఆయన నోటి నుంచి మరెన్ని సంచలన ఆదేశాలు వెలువడతాయో.. వేచి చూడాల్సిందే.