యూపీలో వాహనదారులకు యోగీ బంపర్ ఆఫర్- ఆ ఐదేళ్ల ట్రాఫిక్ చలాన్లన్నీ రద్దు...
ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తాజాగా ఇదే క్రమంలో మరో నిర్ణయం తీసుకున్నారు. యూపీలో తన తొలి ప్రభుత్వం పాలించిన 2017 నుంచి 2021 వరకూ రాష్ట్రంలో వాహనదారులపై విధించిన అన్ని చలాన్లను రద్దు చేయాలని యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయించారు. దీంతో ఆ ఐదేళ్లలో విధించిన అన్ని చలాన్లను అధికారులు రద్దు చేస్తున్నారు.
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2017 నుండి 2021 వరకు పెండింగ్లో ఉన్న ప్రైవేట్, వాణిజ్య వాహనాల యజమానుల అన్ని ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. వాహనం రకంతో సంబంధం లేకుండా 1 జనవరి 2017 నుంచి 31 డిసెంబర్ 2021 మధ్య జారీ చేసిన చలాన్లపై ఈ రద్దు వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి.

అన్ని ప్రాంతీయ రవాణా అధికారులను కోర్టు కేసుల జాబితాను స్వీకరించిన తర్వాత పోర్టల్ నుండి ట్రాఫిక్ చలాన్లను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని చాలా మంది ప్రైవేట్, వాణిజ్య వాహనాల యజమానులకు ఊరట దక్కనుంది. సిఎం యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని లక్షలాది మంది వాహన యజమానులు స్వాగతించారు. ముఖ్యంగా గతంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా ఊరట పొందుతున్నారు.
పాత పెండింగ్లో ఉన్న చలాన్ల రద్దు జూన్ 2023 నాటి యూపీ ఆర్డినెన్స్ నంబర్ 2 ప్రకారం ఉందని రవాణా కమీషనర్ వెల్లడించారు. తాజాగా నోయిడాలోని రైతులు పాత చలాన్ల రద్దు కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే యోగీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. యూపీ ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మరిన్ని వివరాలు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
వాహనదారులు రవాణాశాఖ వెబ్ సైట్లోకి వెళ్లి తమ వాహనం నంబర్ ఎంటర్ చేసి చలాన్ల వివరాలు తెలుసుకోవచ్చని, తప్పుడు చలాన్ జారీ చేయబడిందని డ్రైవర్లు భావిస్తే, వారు నేరుగా వెబ్సైట్లో ఫిర్యాదు కూడా చేయవచ్చని తెలిపింది. వాహనం యొక్క చలాన్ తీసేసిన తర్వాత సెల్ ఫోన్ కు మెసేజ్ కూడా పంపుతున్నారు.












Click it and Unblock the Notifications