ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశ్న, కంటతడి పెట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: పుల్వామా దాడిలో అమరజవాన్లను తలుచుకొని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారు. శనివారం నాడు లక్నోలో ఇంజినీరింగ్ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు.
ఉగ్రవాదంపై ఏం చర్యలు తీసుకున్నారని విద్యార్థి ప్రశ్న
ఓ విద్యార్థి పుల్వామా ఉగ్రవాద దాడిని ఉద్దేశించి ప్రశ్నిస్తూ... దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగిందని, గతంలో జరిగిన దాడులపై కూడా విచారణ జరిపామని, కానీ ఏం చేసినా ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి సమయంలో ఉగ్రవాదంపై పోరుకు మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని సదరు విద్యార్థి ప్రశ్నించారు.
మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని యోగి
ఈ సందర్భంగా యోగి మాట్లాడారు. ఇలాంటి దాడులు జరిగినప్పుడు చర్చలు జరుగుతాయని, కాశ్మీర్లో ఎం జరుగుతుందో అందరికీ తెలుసునని, ప్రస్తుతానికి కాశ్మీర్లో తీవ్రవాదానికి ముగింపు పలికే దిశలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, ఉగ్రవాద నిర్మూలనకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. దాడి ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. త్వరలో పరిస్థితులు అదుపులోకి వస్తాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేస్తుందన్నారు.
యోగి ఆదిత్యనాథ్ కంటతడి
యోగి ఈ సమాధానం చెబుతూ పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్లను గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు. కంట నుంచి నీరు ఉబికి వచ్చింది. అతను వెంటనే తన చేతి రుమాల్ తీసుకొని కన్నీళ్లు తుడుచుకున్నారు. ఇలాంటి ఘటనలు ఒకదానివెంట ఒకటి జరుగుతూనే ఉన్నాయని, కానీ పుల్వామా ఆత్మాహుతి దాడి అత్యంత దారుణమైనదిగా యోగి అభివర్ణిస్తూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం కళ్లు తుడుచుకొని మరో ప్రశ్న కోసం ఎదురు చూశారు.