యోగీ సర్కార్ మరో సంచలనం-ఇక మదర్సాల్లో జాతీయ గీతం తప్పనిసరి
ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకుటున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మరోసారి స్ధానిక ముస్లింలను టార్గెట్ చేసేలా మరో నిర్ణయం తీసుకుంది. మదర్సాల్లో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
మదర్సాల్లో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయాలంటూ ఎప్పటినుంచో యూపీలో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్ర మదర్సా బోర్డు కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని అమలుచేయాలంటూ అన్ని మదర్సాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మదర్సాలన్నీ తప్పనిసరిగా ఉదయం క్లాసులు ప్రారంభం కాకముందు జాతీయ గీతం ఆలాపించేలా విద్యార్ధుల్ని సంసిద్ధం చేస్తున్నాయి.
ఇప్పటికే యూపీలో యోగీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మసీదుల్ని టార్గెట్ చేసింది. వాటిపై లౌడ్ స్పీకర్ల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయంటూ నిషేధం విధించింది. విమర్శలు రావడంతో అన్ని ప్రార్ధనా స్ధలాలపై లౌడ్ స్పీకర్లు తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు కావడం లేదు. దీంతో యోగీ సర్కార్ నిష్పక్షికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ముస్లిం విద్యార్దులు చదువుకునే మదర్సాల్లో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ లేని కొత్త నిబంధన ఎందుకున్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.