గోద్రా: మోడీకి కోర్టు క్లీన్ చిట్, పోరాడుతానని జకియా
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ న్యాయస్థానం గురువారం క్లీన్ చిట్ ఇచ్చింది. గోద్రా అల్లర్ల ఘటనపై మోడీకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై జకియా జాఫ్రీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన అలహాబాద్ న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెలువరించింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు మోడీకి, బిజెపికి ఈ తీర్పు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఈ తీర్పు కోసం దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు.
కాగా, 2002 అల్లర్ల ఘటన సమయంలో మృతి చెందిన ఇషాన్ జాఫ్రి సతీమణి జకియా జాఫ్రి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, మరో 59 మంది పైన కోర్టు గడప తొక్కింది. సీనియర్ మంత్రులు, అధికారులు, పోలీసులతో కలిసి మోడీ రాష్ట్రంలో మత ఘర్షణల కుట్రకు పాల్పడ్డారని జకియా ఆరోపిస్తున్నారు.
అంతకుముందు గోద్రా అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణ చేపట్టింది. 2008 మార్చి 8వ తేదీన సుప్రీం కోర్టు సిట్ను నియమించింది. నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన సిట్ 2012 ఫిబ్రవరిలో అల్లర్లలో మోడీ పాత్ర లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిని జకియా న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఆమె పిటిషన్ పైన విచారణ జరిపిన కోర్టు ఈ రోజు తీర్పులో మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది.
28 ఫిబ్రవరి 2002న జరిగిన అల్లర్ల ఘటనలో నాటి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఇషాన్ జాఫ్రీ సహా 68 మంది మృతి చెందారు. అల్లర్ల సమయంలో జాఫ్రీ ఫోన్ చేసి సహకారం కోరినప్పటికీ పోలీసు అధికారుల నుండి స్పందన రాలేదని ఆరోపణలు ఉన్నాయి. మోడీని సిట్ 2010లో గోద్రా అల్లర్ల కేసులో విచారించింది.
న్యాయం జరిగే వరకు పోరాడుతా: జకియా
తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని జకియా జాఫ్రీ అన్నారు. మోడీకి సిట్ క్లీన్ చీట్ ఇవ్వడాన్ని అహ్మదాబాద్ కోర్టు సమర్థించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. కోర్టు తీర్పుపై తాను పైకోర్టుకు వెళ్తానని, అక్కడ తనకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.