ఐరాసలో చైనా వ్యతిరేక ఓటుకు భారత్ దూరం-పశ్చిమ దేశాలకు షాక్-ఓడిన తీర్మానం
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతూ పోయింది. చివరికి తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులోనూ భారత ప్రధాని మోడీ-చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పలకరించుకునేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ భారత్ మాత్రం ఐరాసలో చైనాకు ఓ మేలుచేసింది.
చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనపై చైనాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేసేందుకు భారతదేశంతో పాటు 10 ఇతర దేశాలు నిరాకరించాయి. అలాగని సమర్ధించలేదు. దూరంగా ఉండిపోయాయి. 2017నుంచి జిన్జియాంగ్లో ఉయ్ ఘర్లు, కజఖ్లు, ఇతర ముస్లిం మైనారిటీలపై చైనా అణిచివేతపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చైనా మాత్రం దీన్ని ఉగ్రవాదంపై పోరు పేరుతో కొనసాగిస్తోంది. చైనాలోని ఉయ్ ఘర్ ముస్లింలపై దాడులకు సంబంధించి ఐరాస మానవ హక్కుల విభాగం ఓటింగ్ నిర్వహిస్తోంది. ఇందులో భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ పాల్గొనాల్సి ఉంది.కానీ చివరి నిమిషంలో భారత్ సహా 11 దేశాలు ఈ ఓటింగ్ కు దూరంగా ఉండాలని సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
పశ్చిమ దేశాలు చైనాలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఐరాస మానవ హక్కుల విభాగంలో తీర్మానం ప్రవేశపెట్టాయి. కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్, యూకే, యూఎస్ లతో కూడిన కోర్ గ్రూప్ దీన్ని సమర్పించింది. ఉయ్ ఘర్ ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై చర్చకు మద్దతునిచ్చేందుకు దేశాలు ప్రయత్నించగా, కేవలం 17 మంది సభ్యులు మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. చైనా, పాకిస్థాన్, నేపాల్ సహా 19 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. భారత్, బ్రెజిల్, మెక్సికో, ఉక్రెయిన్తో సహా 11 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో ఈ తీర్మానం వీగిపోయింది.