సౌదీలో క్షిపణిదాడి: ఇద్దరు భారతీయులు మృతి
రియాద్: సౌదీ అరేబియాలోని నాజ్రాన్ నగరంపై జరిగిన క్షిపణి దాడిలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు భారతీయులున్నారు. ఈ ఏడాది జరిగిన ఇలాంటి దాడుల్లో భారతీయులు చనిపోవడం ఇది మూడోసారి.
యెమెన్ సరిహద్దు నుంచి శనివారం వచ్చిన క్షిపణి దాడిలో సౌదీ పౌరుడుసహా ఇద్దరు భారతీయులు చనిపోయినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. మరికొందరు ఈ ఘటనలో గాయాలపాలయ్యారని వెల్లడించింది.
కాగా, భారతీయులు మృతి చెందిన విషయంపై అక్కడి భారత రాయబార కార్యాలయం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గత సెప్టెంబర్లో జరిగిన మోర్టార్ దాడుల్లో ఒక భారతీయుడు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. మరోసారి జిజాన్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ భారతీయుడు చనిపోయాడు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.
ఇండోనేషియా పడవ ప్రమాదంలో ఇద్దరిమృతి
బాలి: ఇండోనేషియా సముద్రంలో ప్రమాదానికి గురైన పడవలోని ప్రయాణికుల్లో 25 మందిని రక్షించారు. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 118 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్న ఆ పడవలో మిగిలిన వారిగురించి వెతుకుతున్నారు.
సులవేసీ తీరానికి సమీపంలో ఉవ్వెత్తున లేచిన అలల ధాటికి శనివారం ఆ పడవ ప్రమాదం పాలైన సంగతి తెలిసిందే. ప్రమాద సమాచారం అందగానే అధికారులు ఆరు బోట్లలో సహాయ సిబ్బందిని పంపించారు. సముద్రంపై వాతావరణం ప్రతికూలంగా ఉండట వల్ల సహాయచర్యలకు ఆటంకం కలుగుతున్నదని సంబంధిత విభాగం అధికారి రోకీ అసికిన్ తెలిపారు.
ప్రమాదానికి గురైనవారిలో లైఫ్ జాకెట్లు వేసుకుని నీటిలో తేలియాడుతున్న మహిళ, బాలుడితోపాటు మరో ఇద్దరిని జాలర్లు రక్షించగా, 21 మందిని అటుగా మరో పడవలో వచ్చినవారు కాపాడారని ఇండోనేషియా రవాణా మంత్రిత్వశాఖ ప్రతినిధి జేఏ బరాటా తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.