ఇరాక్ క్రైసిస్: 40 మంది భారతీయులు గల్లంతు
న్యూఢిల్లీ: చమురు సంపద పుష్కలంగా ఉన్న ఇరాక్లో మోసుల్ నగరంలోని ఓ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40 మంది భారతీయులు జాడ తెలియడం లేదు. వారిని ఎఎస్ఐఎస్ తిరుగుబాటుదారులు అపహరించి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ ధ్రువీకరించడం లేదు.
ఐఎస్ఐఎస్కు, కుర్ద్లకు మధ్య జరుగుతున్న పోరుకు నిలయంగా మారిన మోసుల్ నుంచి ప్రజలను ఖాళీ చేయించే సమయంలో చాలా మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ అధికారులతో సంబంధాల్లోకి రాలేదు. కుర్ద్ల ప్రాబల్యం ఉండే ఈ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఆక్రమించింది.
రిజిస్ట్రేషన్ లేకుండా ఆ కార్మికులను పనిలో చేర్చుకోవడంతో అధికారులు వారిని సంప్రదించలేకపోతున్నట్లు తెలుస్తోంది. గల్లంతయిన భారతీయులను సంప్రదించలేకపోతున్నట్లు అంగీకరిస్తున్నప్పటికీ వారి అహహరణ జరిగిందనే విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ ధ్రువీకరించడం లేదు.
కాగా, తిక్రిత్లో 46 మంది నర్సులు చిక్కుకుపోయారు. వీరిలో చాలా మంది కేరళ రాష్ట్రానికి చెందినవారు. చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. కానీ వారికి ఏ విధమైన సహాయం అందడం లేదు. సద్దాం హుస్సేన్ సొంత నగరమైన తిక్రిత్ ప్రస్తుతం ఐఎస్ఐఎస్ నియంత్రణలో ఉంది.

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వారితో మాట్లాడి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో దాదాపు 100 మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు ఇరాక్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. భారత మాజీ దౌత్యవేత్త సురేష్ రెడ్డిని బగ్దాద్ పంపించే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, బద్గాద్ నగరాన్ని కూడా ఐఎస్ఐఎస్ చుట్టుముట్టే ప్రయత్నాలు చేస్తోంది.
విదేశీవ్యవహారాల మంత్రి శాఖ ఢిల్లీ కంట్రోల్ రూం
+91 11 2301 2113, +91 11 2301 7905, +91 11 2301 4104.
Email: [email protected]
బాగ్దాద్లోని భారత దౌత్య కార్యాలయం
+964 770 444 4899, +964 770 484 3247












Click it and Unblock the Notifications