హార్ట్ టచింగ్ : బిడ్డలను కాపాడుకునేందుకు తన మూత్రం తానే తాగిన తల్లి-ఎందుకిలా చేసిందంటే...
ఈ భూమిపై అత్యంత నిస్వార్థ ప్రేమామయి ఎవరైనా ఉన్నారంటే అది అమ్మనే. బిడ్డల పట్ల తల్లి ప్రేమ అనంతం. అవసరమైతే తన ప్రాణాలు అడ్డుపెట్టయినా బిడ్డలను రక్షించుకోగలదు. తాజాగా వెనిజులాకు చెందిన ఓ తల్లి... మృత్యువు అంచులో బిడ్డల ప్రాణాలు కాపాడి తాను కన్నుమూసింది.కుటుంబంతో సహా పెను ఆపదలో చిక్కుకుపోయిన వేళ... బిడ్డలను కాపాడుకునేందుకు ఆ తల్లి వ్యవహరించిన తీరు హృదయాలను ద్రవింపజేసిదిగా ఉన్నది. ఇంతకీ ఆ తల్లి ఏం చేసిందంటే...
అసలేం జరిగింది...
వెనిజులాకు చెందిన మెరిలీ చాకోన్(40),ఆమె భర్త,ఆరేళ్ల కొడుకు,రెండేళ్ల కూతురు,25 ఏళ్ల ఓ సహాయక సిబ్బందితో కలిసి సెప్టెంబర్ 3న కరేబీయన్ దీవుల్లో విహారానికి వెళ్లారు. హిగురుటో నుంచి టోర్టుగా దీవికి కుటుంబమంతా ఓడలో బయలుదేరారు. సరదాగా సాగుతుందనుకున్న ప్రయాణంలో అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఆపదలో పడేసింది. భారీ అలలు ఓడను ముంచెత్తడంతో.. ఓడ రెండుగా చీలిపోయింది. కొంత భాగం నీటిలో మునగగా... మరికొంత భాగం పైకి తేలింది. ఈ ప్రమాదంలో మెరిలీ చాకొన్ భర్తతో పాటు ఓడలో ప్రయాణిస్తున్న మరికొందరు గల్లంతయ్యారు.
నడిసముద్రంలో చిక్కుకుపోయిన వేళ...
మేరి చాకొన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి లైఫ్ బోట్ సాయంతో ఓడ నుంచి బయటపడి సాయం కోసం ఎదురుచూడసాగింది.కానీ ఆ నడి సముద్రంలో వారికి సాయం చేసేవారెవరు.అలా ఆ ముగ్గురు నాలుగు రోజుల పాటు తిండి,తిప్పలు లేక అదే లైఫ్ బోట్లో నిస్సహాయంగా ఉండిపోయారు. ఎండి వేడి ఎక్కువగా ఉండటం,నీళ్లు,ఆహారం లేకపోవడంతో అప్పటికే శరీరాలు డీహైడ్రేషన్కు గురయ్యాయి. ఈ స్థితిలో తన బిడ్డలను బతికించుకోవడానికి ఒక్కటే మార్గం ఉందని ఆ తల్లి భావించింది. పిల్లలకు పాలిచ్చి వారిని డీహైడ్రేషన్ నుంచి కాపాడాలనుకుంది. పాలు రావాలంటే శరీరం డీహైడ్రేషన్ నుంచి బయటపడాలి. ఇందుకోసం తన మూత్రాన్ని తానే సేవించింది. ఆపై పిల్లలకు కొన్ని పాలిచ్చి వారిని బతికించుకోగలిగింది.కానీ ఆ తర్వాత డీహైడ్రేషన్ ఎక్కువై శరీరంలో అవయవాలు దెబ్బతినడంతో ఆమె చనిపోయింది.
ఎట్టకేలకు... నాలుగు రోజుల తర్వాత
చనిపోయిన తల్లిని పట్టుకుని ఆ ఇద్దరు చిన్నారులు ధీనంగా లైఫ్ బోట్లోనే ఉండిపోయారు.నాలుగు రోజుల తర్వాత వెనిజులాకు చెందిన ఓ నౌక ఒకటి అటువైపు రావడంతో... లైఫ్ బోట్లో ఉన్న చిన్నారులను గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించారు. అప్పటికే మెరిలీ చాకొన్ మృతి చెందినట్లు గుర్తించారు.ఆ కుటుంబానికి సహాయంగా వెళ్లిన 25 ఏళ్ల వెరోనికా మార్టినెజ్ను కూడా వారు రక్షించగలిగారు.ఎండ వేడిని,డీహైడ్రేషన్ను తట్టుకునేందుకు ఆమె ఓ ఐస్ బాక్సులో దాక్కున్నట్లు వారు గుర్తించారు. ఈ ఘటనపై వెనిజులా నేషనల్ మెరీటైమ్ అథారిటీ అధికారి ఒకరు మాట్లాడుతూ... చనిపోయిన మెరిలీ చాకొన్ తన బిడ్డలకు పాలిచ్చి బతికించుకునేందుకు తన మూత్రాన్ని తానే సేవించారని చెప్పారు. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకోవడానికి మూడు,నాలుగు గంటలకు ముందే ఆమె చనిపోయినట్లు గుర్తించామన్నారు.
కన్నీటి సంతాపం....
తన పిల్లలను కాపాడుకునేందుకు మెరిలీ చాకొన్ చేసిన పని చాలామంది హృదయాలను ద్రవింపజేసింది. ఆమె మరణం పట్ల ఎంతోమంది కన్నీటి సంతాపం ప్రకటించారు. ఓ నెటిజన్ ఈ ఘటనపై స్పందిస్తూ...'మిమ్మల్ని కలిసే అదృష్టం నాకు లేకపోయింది.మీ హృదయం ఎంత గొప్పదో చివరి క్షణాల్లో మీరు చేసింది చెబుతోంది.మీరో నిరంతర కాంతి జీవి.' అని పేర్కొన్నారు. మెరిలీ చాకొన్ తండ్రి హంబర్టో చాకొన్ మాట్లాడుతూ... సరదాగా కుటుంబంతో కలిసి వెళ్లిన విహార యాత్ర ఇలా విషాదాన్ని మిగులుస్తుందనుకోలేదన్నారు. సముద్రంలో గల్లంతైనవారి కోసం ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.