విరిగిపడిన కొండచరియలు: 2,100 మంది మృతి
కాబూల్: ఆప్ఘనిస్థాన్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆర్గో జిల్లాలోని అరబ్ బరీక్ ప్రాంతంలో గల ఓ మారుమూల ప్రాంతంలో ఓ కొండ విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. శనివారం నాటికి ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 2,100కు చేరిందని ఆప్ఘనిస్థాన్ ప్రొవిజనల్ గవర్నర్ అధికార ప్రతినిధి నవీద్ ఫరోటన్ వెల్లడించారు.
300 కుటుంబాలకు చెందిన సుమారు 2,100 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 700 కుటుంబాలకు చెందిన 4వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఈశాన్య ప్రాంతంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో బదక్షన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దిగువన ఉన్న గ్రామాలను నేలమట్టం చేశాయి.
శుక్రవారం సెలవు దినం కావడంతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇళ్లల్లో ఉండటంతో మరణాల సంఖ్య బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
రోడ్డు మార్గాలన్నీ బురదమట్టితో మూసుకుపోవడంతో సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైమానిక దళం సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఘటనలో మృతి చెందిన వారికి భారత్ తోపాటు పలు దేశాల ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.












Click it and Unblock the Notifications