అమెరికా సూచనతో కాళ్లబేరానికి పాకిస్తాన్ ? భారత్ కు ఉపప్రధాని కీలక ప్రతిపాదన..!
పహల్గాం దాడికి ప్రతీకారం భారత్ మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే పలు ఆర్మీ బేస్ లతో పాటు సరిహద్దుల్లోనూ భారీగా నష్టం చవిచూస్తున్న పాకిస్తాన్ కు అణ్వాయుధాల ప్రయోగం మినహా మరో దారి కనిపించడం లేదు. అదే సమయంలో వెనక్కి తగ్గాలని అమెరికా లాస్ట్ వార్నింగ్ ఇచ్చేసింది. ఇలాంటి పరిస్దితుల్లో పాకిస్తాన్ ఉపప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్ భారత్ కు ఓ కీలక ప్రతిపాదన చేశారు. దీనికి భారత్ అంగీకరిస్తే తాము కూడా అందుకు సిద్ధమని వెల్లడించారు.
రెండు రోజులుగా పాకిస్తాన్ వైమానిక దళ, సైనిక స్థావరాలపై భారత్ ఖచ్చితమైన వైమానిక దాడులు జరుపుతుంండంతో పాకిస్తాన్ 'ఆపరేషన్ బన్యన్-అన్-మర్సూస్'పేరుతో ఎదురుదాడిని మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాకిస్తాన్ కొత్త ఆపరేషన్ ను సైతం భారత బలగాలు సమర్ధంగా అడ్డుకుంటున్నాయి. దీంతో తాజా పరిణామాల్ని గమనిస్తున్న పాకిస్తాన్ ఉపప్రధాని,విదేశాంగమంత్రి ఇషాక్ దార్ భారత్ ముందు కీలక ప్రతిపాదన చేశారు.

భారతదేశం తన సైనిక దాడిని ఆపితే తమ దేశం ఇక్కడే ఆగడాన్ని పరిశీలిస్తుందని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్దితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఉద్రిక్తతను తగ్గించాలని కోరుకుంటుందని , భారత్ తో చర్చల కోసం కొత్త కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాలు సీఎన్ఎన్ న్యూస్ కు వెల్లడించాయి.
వాళ్ళు ఆగిపోతే, మేం కూడా అలాగే చేస్తామని ఇషాక్ దార్ తెలిపారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, భారతదేశం ఈ సమయంలో ఆగిపోతే మనం కూడా శాంతిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ప్రతీకారం తీర్చుకోమని, ఏమీ చేయమని కూడా చెప్పుకొచ్చారు. తాము నిజంగా శాంతిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా భారత్ సరిహద్దులో తన కార్యకలాపాలను నిలిపివేస్తే తదుపరి చర్యలకు దూరంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో భారత్ దాడులు పాకిస్తాన్ ను ఏ స్ధాయిలో ఇబ్బందులు పెడుతున్నాయనో అర్దమవుతోంది. ఇప్పటికే భారత దాడులకు తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ సైతం దేశం విడిచి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం యుద్ధంపై స్పందించకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇవాళ పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి/విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో మాట్లాడారు. ప్రస్తుత ఉద్రిక్తతల్ని తగ్గించడానికి, తప్పుడు సమాచారాన్ని నివారించడానికి, ప్రత్యక్ష చర్చలు తిరిగి ప్రారంభించడానికి రెండు దేశాలూ మార్గాలను కనుగొనాలని సూచించారు. భవిష్యత్తులో సంఘర్షణలను నివారించడానికి నిర్మాణాత్మక చర్చలను ప్రారంభించడంలో అమెరికా సహాయాన్ని కూడా అందిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇషాక్ దార్ భారత్ కు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications