‘ఏసియాన్’లో బరాంగ్ తగలాగ్’ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్: దేశాధినేతలందరిదీ ఒకే చొక్కా
దక్షిణ చైనా సముద్రంలో దూకుడుగా చైనా సైన్యం కదలికలు.. మరోవైపు ఉత్తరకొరియా అణ్వస్త్ర క్షిపణి ప్రయోగాలు.. అమెరికా, దాని మిత్రపక్షాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Recommended Video
మనీలా: ఫిలీప్పీన్స్లోని పసాయ్లో జరిగే ఏసియాన్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాధినేతలంతా ఆదివారం రాత్రి ఆహుతులను ఆకట్టుకున్నారు. 'ఏసియాన్' స్వర్ణోత్సవాల సందర్భంగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే ఇచ్చిన విందుకు హాజరైన అధినేతలు 'బరాంగ్ తగలాగ్' అనే ఫిలీప్పీన్స్ జాతీయ చొక్కాను ధరించడం గమనార్హం. ఈ చొక్కాలను ఆల్బర్ట్ ఆండ్రెడా అనే డిజైనర్ రూపొందించారు.
ఏసియాన్ సదస్సులో పాల్గొనడంతోపాటు ఆ దేశంలో మూడు రోజుల పర్యటన కోసం వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం మనీలా చేరుకున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఫిలిప్పీన్స్ లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డు నెలకొల్పారు.
దేశాధినేతలకు మోదీ మర్యాద పూర్వక పలుకరింపు
ఆదివారం సాయంత్రం వియత్నాం నుంచి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ప్రధాని మోదీ కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్,రష్యా ప్రధాని డిమిట్రీ మెద్వెదేవ్, మలేషియా ప్రధాని నజీబ్రజాక్, జపాన్ ప్రధాని షింజోఅబే, ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టేతోనూ ప్రధాని మోడీ ఆత్మీయంగా కరచాలనం చేసి పలకరించారు. చైనా ప్రధాని లీతో మోడీ ఆత్మీయంగా సంభాషించినట్టు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్కుమార్ ట్వీట్ చేశారు. పలువురు నేతలతో సమావేశమైన దృశ్యాలను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
చైనా దూకుడు, ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలపై చర్చ
సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోపాటు పలువురు దేశాధినేతలతో ప్రధాని మోడీ వేర్వేరుగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. మంగళవారం జరిగే ఇండియా-ఏసియాన్ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అదేరోజు తూర్పు ఆసియా దేశాల సదస్సులోనూ ప్రధాని ప్రసంగించనున్నారు. ఆసియా దేశాల్లో ఉగ్రవాదం, ఉత్తర కొరియా అణ్వస్త్ర క్షిపణుల పరీక్షలు, దక్షిణచైనా సముద్ర ప్రాంతంలో చైనా దూకుడు పలు అంశాలు దేశాధినేతల మధ్య చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.
ఫిలిప్పీన్స్ లో ఇలా మోదీ పర్యటన
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సీఈపీ) సదస్సులోనూ ప్రధాని మోడీ పాల్గొంటారు. వాణిజ్యం,పెట్టుబడులపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఆసియాన్లోని పది సభ్య దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా, న్యూజిలాండ్,ఆస్ట్రేలియా దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ఆర్సీఈపీని ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్ లోని భారత సంతతి పౌరులు ఇచ్చే విందుకు ప్రధాని మోదీ హాజరవుతారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ), మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్లను ప్రధాని మోదీ సందర్శిస్తారు.
చతుర్భుజ కూటమి ఏర్పాటుకే అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సుముఖం
ఇండో - పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు భద్రతా రంగంలో పరస్పర సహకారానికి చతుర్భుజ కూటమి ఏర్పాటు చేయాలని అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఆసియాన్ సదస్సు సందర్భంగా ఆదివారం నాలుగు దేశాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరింది. ప్రపంచ దేశాల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర ఇండో - పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతమైనదిగా తీర్చిదిద్దేందుకు ఆ దేశాల మధ్య అంగీకారం కుదిరింది అని భారత్ విదేశాంగశాఖ తెలిపింది. ఈ నాలుగు దేశాలు స్వేచ్ఛా వాణిజ్యం పురోభివృద్ధితోపాటు రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోనున్నాయి.
ఫిలిప్పీన్స్ తో చర్చలు కొనసాగిస్తామన్న చైనా ప్రధాని లీ కియాంగ్
మనీలా:దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై వివాదాలను తమ పొరుగు దేశాలతో ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని చైనా ప్రధాని లీ కెఖియాంగ్ మరోసారి స్పష్టం చేశారు. సముద్రప్రాంత అంశాలపై ఫిలీప్పీన్స్తో చర్చలను కొనసాగిస్తామని, స్నేహపూర్వక సంప్రదింపుల కోసం ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని లీ తెలిపారు. ఇరు దేశాలకు లబ్ది చేకూరేలా దక్షిణ చైనా సముద్రాన్ని స్నేహానికి, సహకారానికి గుర్తుగా తయారు చేస్తామని లీ అన్నారు.