అల్ జవహరీ అలవాటే అతడి కొంప ముంచింది
తాలిబన్ల రాజ్యంలో సురక్షితంగా ఉన్న అల్ జవహరీని అమెరికా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చాకచక్యంగా మట్టుబెట్టింది. జవహరీకి ఒంటరిగా బాల్కనీలో ఉండి పుస్తకాలు చదువుకునే అలవాటు ఉంది. ఈ అలవాటే అతడు హతమవడానికి కారణమైంది. కాబూల్ లోని ఓ నివాసంలో ఉంటున్నట్లు అధికారులు నిర్థారించుకున్న తర్వాత జవహరీ కదలికలపై సీఐఏ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసుకుంది. అల్ ఖైదా అధినేత జీవనశైలిని సీఐఏ అధికారులు నిరంతరం నిశితంగా గమనిస్తూ వచ్చారు. ముఖ్యంగా అతడి అలవాట్లపై కన్నేశారు. ప్రతిరోజు మంచి గాలిని పీల్చడానికి బాల్కనీలో గడుపుతుండటం, అక్కడే ఎక్కువ సేపు ఉంటున్నాడని నిర్థారించుకున్న తర్వాత దాడికి ప్రణాళిక రచించుకున్నారు. అతన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని డ్రోన్ సాయంతో క్షిపణుల దాడి ద్వారా మట్టుబెట్టారు.
భారత్ లో హిజాబ్ వివాదం తలెత్తినప్పుడు కూడా జవహరీ వీడియో విడుదల చేశారు. వారిని ఎదురించి విద్యార్థిని చూసి తాను గర్విస్తున్నానని, తనకు కవిత్వం రాకపోయినప్పటికీ ఆ విద్యార్థినిని స్ఫూర్తిగా తీసుకోవడానికి కవిత రాయాలనుందని చెప్పారు. భారత్ పై ఉగ్రదాడులకు పాల్పడేవారందరికీ తాలిబన్లు ఆశ్రయం కల్పించే అవకాశం ఉండటంతో జవహరీ హతమవడం దేశానికి అవసరమని అధికారులు అభిప్రాయపడ్డారు. జవహరీపై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ప్రకటించింది. అతన్ని హతమార్చేందుకు అవసరమైన ఆయుధాన్ని ఎంపిక చేసుకోవడానికి కూడా అమెరికా అనేక జాగ్రత్తలతో వ్యవహరించింది. హెల్ ఫైర్ R9X మోడల్ క్షిపణితో జవహరీని కూల్చేసింది.