యురేనియం సరఫరా: ఆస్ట్రేలియా ఓకే
సిడ్నీ: భారత్ కు యురేనియం సరఫరా చెయ్యడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. భారత్ కు యురేనియం సరఫరా చేసే విషయంలో ఆస్ట్రేలియా-భారత్ గత 8 సంవత్సరాల నుంచి సుధీర్ఘంగా చర్చిస్తున్నది.
ఆస్ట్రేలియా-భారత్ అణు సహకార ఒప్పందం కుదిరిందని, ఇది తక్షణం అమలులోకి వస్తుందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రకటించారు. భారత్ లో పెరుగుతున్న విద్యుత్ అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేయనుందని అన్నారు.

భారతదేశానికి యురేనియం సరఫరా చెయ్యడానికి గతంలో ఆస్ట్రేలియా సుముఖంగా ఉండేది. అయితే న్యూక్లియర్ అణు నిరాయుధాకరణ ఒప్పందంపై సంతకం చెయ్యడానికి భారత్ నిరాకరించడంతో కథ అడ్డం తిరిగింది.
తరువాత ఆస్ట్రేలియాలో ప్రభుత్వాలు మారడం తదితర కారణాల వలన యురేనియం సరఫరా చేసే విషయంలో 8 సంవత్సరాలు వేచి చూడవలసి వచ్చింది. అయితే ఇప్పుడు భారత్ తో పాటు యూఏఈతో యురేనియం సరఫరా చెయ్యడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియన్ కంపెనీలు భారత్ తో యురేనియం వ్యాపారం చెయ్యడానికి ఓ చక్కటి అవకాశం చిక్కింది.












Click it and Unblock the Notifications