షేక్ హసీనా వెనక్కి ? బంగ్లాదేశ్ సర్కార్ కీలక ప్రకటన..!
రిజర్వేషన్ల మార్పులతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో దేశాన్ని వీడి భారత్ పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సరైన సమయం చూసి తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు యోచిస్తున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్ లో ఈ మద్యే కొలువుదీరిన తాత్కాలిక ప్రభుత్వం కూడా ఆమెను తిరిగి రప్పించే విషయంలో ఆలోచనలో పడుతోంది. హసీనాను వెనక్కి రప్పించాలన్న డిమాండ్లు స్వదేశంలోనూ వినిపిస్తున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెనక్కి రప్పించే విషయంలో తాత్కాలిక ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన చేసింది. న్యాయ మంత్రిత్వశాఖ కోరితే ఆమెను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వంలో విదేశాంగశాఖ సలహాదారుగా ఉన్న మొహమ్మద్ తౌహీద్ హొసైన్ ఓ ప్రకటన చేశారు. అలాగే ఢాకా-ఢిల్లీ సంబంధాలపైనా ఆయన స్పష్టత ఇచ్చారు.

భారత్ తో సత్సంబంధాలు ఉండాలని తమ ప్రజలు కోరుకుంటున్నారని, తాము కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత్ నుంచి కూడా సానుకూల వైఖరి ఉంటుందని భావిస్తున్నట్లు విదేశాంగశాఖ సలహాదారు తెలిపారు. తమ దేశ ప్రయోజనాలను రక్షించుకుంటూనే అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏ దేశంతోనూ శత్రుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. కానీ తమ ప్రయోజనాలు రక్షించుకోవడమే ప్రస్తుతం ముఖ్యమని తెలిపారు. భారత్, చైనాతో స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం తమ కర్తవ్యం అన్నారు.












Click it and Unblock the Notifications