భారత్ సరిహద్దులన్నీ మూసివేసిన బంగ్లాదేశ్: మొన్నే ప్రధాని మోడీ సందర్శన..అంతలోనే
ఢాకా: పొరుగునే ఉన్న బంగ్లాదేశ్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్తో పంచుకుంటోన్న సరిహద్దులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం నుంచీ వరుసగా సరిహద్దులను మూసివేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 14 రోజుల తరువాతే వాటిని పునరుద్ధరించనుంది. భారత్లో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా- భారత్తో పంచుకుంటోన్న సరిహద్దులన్నింటినీ మూసివేస్తున్నట్లు తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన బంగ్లాదేశ్లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా సహా ఇతర మంత్రులతో సమావేశమయ్యారు. షాత్కీరా జిల్లాలోని ప్రఖ్యాత జెశోరేశ్వరి కాళికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి కిరీటాన్ని బహూకరించారు. ఆయన పర్యటించి వచ్చిన సరిగ్గా నెల రోజులకు బంగ్లాదేశ్.. భారత్తో సరిహద్దులను మూసివేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత్లో లక్షల సంఖ్యలో పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. రెండు దేశాల మధ్య సరుకుల రవాణాకు ఉద్దేశించిన వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్, హోమ్ శాఖ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ తెలిపారు. వైద్యం, ఇతరత్రా అవసరాల కోసం భారత్కు వెళ్లిన బంగ్లాదేశీయులు స్వదేశానికి తిరిగి రావడానికి బెనాపోల్, అఖౌరా, బురిమారి సరిహద్దులు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు.
కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే దేశంలోకి రానిస్తామని స్పష్టం చేశారు. స్వదేశానికి రావడానికి ముందు న్యూఢిల్లీ, కోల్కత, అగర్తలాల్లో గల బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అలా వచ్చిన వారిని కూడా రెండు వారాల పాటు క్వారంటైన్ చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని రాయబార కార్యాలయాలకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు వివరించారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, సింగపూర్ వంటి దేశాలు భారత్తో విమానయాన సంబంధాలను తెంచుకున్న నేపథ్యంలో తాము సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.