భారత్ కు అనూహ్య దౌత్య సవాల్ ? మిత్రదేశాల సాయం కోరిన కెనడా-స్పందిస్తే ఇబ్బందే !
భారత్ లో ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోరుతూ కెనడాలో ఉద్యమం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య ఇప్పుడు ఇండియా-కెనడా మధ్య తీవ్ర చిచ్చు రేపుతోంది. రెండు రోజుల క్రితం పార్లమెంటులో హర్దీప్ సింగ్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అంతటితో ఆగకుండా దీనికి బాధ్యతగా భారత సీనియర్ దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. కెనడా దౌత్యవేత్తనూ సాగనంపింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ పై ఆరోపణలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇప్పుడు ఈ వ్యవహారంలో తన ఐదు మిత్రదేశాల సాయం కోరారు. ఇందులో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటు కెనడా కూడా ఉన్న ఐదు కళ్ల కూటమి ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ ఏజెంట్లను పంపి తమ పౌరుడ్ని హత్య చేయడమే కాకుండా తమపై ఎదురుదాడి చేస్తోందంటూ జస్టిన్ ట్రూడో తన నాలుగు మిత్రదేశాలకు సమాచారం పంపారు. దీంతో ఆయా దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్ ఇప్పుడు ఇరుకునపడింది.

కెనడాతో రగడ ముదురుతున్న నేపథ్యంలో భారత్ కు రెండు కీలక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇందులో మొదటిది
భారతదేశం-కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో దౌత్యపరమైన పతనం ఇప్పటికే మొదలైంది. వాస్తవానికి మరో దేశం అయితే భారత్ కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు కెనడా ప్రపంచంలోని అతిపెద్ద భారతీయ ప్రవాసులలో ఒకరికి ఆతిథ్యం ఇస్తున్న దేశం. ఇందులో 16 లక్షల మంది భారతీయ మూలాలు కలిగిన వారు ఉన్నారు. మొత్తం కెనడియన్ జనాభాలో 3 శాతం కంటే ఎక్కువ అంటే 7 లక్షల మంది ఎన్నారైలు ఉన్నారు. అలాగే కెనడాలో చదువుతున్న విదేశీ విద్యార్థులలో భారతదేశం 2.3 లక్షలతో అగ్రస్థానంలో ఉంది.
అలాగే 2021-22లో కెనడాతో భారత్ మొత్తం వాణిజ్యం 11.68 బిలియన్ల యూఎస్ డాలర్లు. ఇది మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువే. కానీ భారతదేశం యొక్క పప్పుల దిగుమతి విషయానికి వస్తే, మొత్తం దిగుమతిలో దాదాపు 30% కెనడా నుండి వస్తుంది. కెనడియన్ పెన్షన్ ఫండ్స్ భారతదేశంలో దాదాపు 55 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టాయి. 2000 నుండి కెనడా నుండి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సుమారు 4.07 బిలియన్ల యూఎస్ డాలర్లు. ఈ మధ్య ఖలిస్తాన్ వివాదంతో ఇరుదేశాల మధ్య గ్యాప్ పెరుగుతున్నా ఇవి మాత్రం కొనసాగాయి. కానీ ఈ వివాదం ముదిరితే సమస్యలు తప్పేలా లేవు.
అలాగే రెండో అంశం జీ20 సదస్సు విజయవంతమైన తర్వాత ఈ రకమైన అభియోగం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టకు మచ్చగా మారుతోంది. నిజ్జార్ విచారణకు సహకరించాలని ట్రూడో భారత్ను కోరారు. భారత్ మాత్రం దీనిపై మౌనం వహిస్తోంది. ఈ సమయంలో భారత్ కెనడాకు సహకరించేందుకు సిద్ధంగా లేదని అర్ధం. భారత్ తో ఇప్పటివరకూ తమ వద్ద ఉన్న నిజ్జార్ హత్య సాక్ష్యాల్ని పంచుకోని కెనడా.. తన నాలుగు మిత్రదేశాలకు మాత్రం ఇచ్చేలా ఉంది. అదే జరిగితే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దీన్ని పరీక్షిస్తాయి. ఇందులో భారత్ పాత్ర బయటపడితే అంతర్జాతీయంగా ఇబ్బందులు తప్పవు.












Click it and Unblock the Notifications