పేలుడుతో దద్ధరిల్లిన లాహోర్: 53 మంది మృతి
లాహోర్: పాకిస్థాన్లోని లాహోర్ పేలుడుతో దద్ధరిల్లింది. నగరంలోని ఓ పార్క్ ఏరియాలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 53 మంది మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. భద్రతాసిబ్బంది, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గుల్షన్-ఇ-ఇక్బాల్ పార్క్లోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో పార్క్కు పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఆ సమయంలో పేలుడు సంభవించింది.
పేలుడు జరిగిన అనంతరం పార్క్లో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరిని తాము రిక్షాలు, టాక్సీల్లో ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. పార్క్ ప్రాంతం చాలా పెద్దదని, దీనికి చాలా ప్రవేశద్వారాలు ఉన్నాయని, భద్రత తక్కువగా ఉందని తెలిపారు.
ఈ పేలుడు ఘటనకు పాల్పడింది ఏ గ్రూప్ అనేది తెలియడం లేదు. ఈస్టర్ వారాంతం ఉత్సవాల్లో మునిగిన క్రైస్తవులు ఉగ్రవాదుల లక్ష్యం కావచ్చునని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలోని అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు. పేలుడు పార్క్ ప్రధాన ద్వారం వద్ద సంభవించినట్లు తెలుస్తోంది.