బ్రిక్స్ విస్తరణ- జిన్పింగ్ సమక్షంలో మోదీ కీలక ప్రకటన..!!
జొహాన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో ఏర్పాటైన బ్రిక్స్ సమ్మిట్ ఓపెన్ ప్లీనరీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. బ్రిక్స్ను భవిష్యత్ అవసరాలకు సంసిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందులో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ప్రస్తుతం బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు సభ్యత్వం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రొవ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత గ్ఝి జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా- ఈ అత్యున్నత సదస్సుకు హాజరయ్యారు.

వారందరూ పాల్గొన్న ఈ ఓపెన్ ప్లీనరీలో మోదీ- బ్రిక్స్ విస్తరణకు హామీ ఇచ్చారు. దీన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి బ్రిక్స్ను విస్తరించాల్సి వస్తే.. తాము మద్దతు ఇస్తామని అన్నారు.
సుమారు రెండు దశాబ్దాల కాల వ్యవధిలో బ్రిక్స్ సుదీర్ఘమైన అనుభవాన్ని సంపాదించిందని, అసాధ్యమనుకున్న కొన్ని సవాళ్లను పరిష్కరించగలిగిందని మోదీ అన్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో అనేక విజయాలు సాధించామని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన బ్రిక్స్లో గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రతిపాదనలను స్వాగతిస్తున్నామని అన్నారు.
ఇదే విషయాన్ని జీ20 అజెండాలోనూ పొందుపరిచామని మోదీ తెలిపారు. ఈ సంవత్సరం జరగబోయే జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బ్రిక్స్ విస్తరణ విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications