ఈయూ నుంచి బ్రిటన్ ఔట్: యూనియన్ దారెటు, పరిస్థితి ఏంటి?
లండన్: ఐరోపా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగాలనే బ్రిటన్ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈయూలో బ్రిటన్ కొనసాగనుందా? వైదొలగాలా? అనే అంశంపై నిర్వహించిన రిఫరెండం ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 51.8 శాతం మంది ప్రజలు ఈయూ నుంచి వైదొలగాలని కోరుకుంటే 48.2 శాతం మంది ప్రజలు ఈయూలోనే కొనసాగాలని కోరుకున్న సంగతి తెలిసిందే.
ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలనే నిర్ణయం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయమై ప్రపంచమంతా ఆసక్తితో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక బ్రిటన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది అందరి మదిలే ప్రశ్న. గురువారం నిర్వహించిన రెఫరెండం ఫలితాన్ని అంగీకరించాలన్న నిబంధన ఏమీ లేనప్పటికీ, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్న ఒత్తిడి బ్రిటన్ ప్రభుత్వంపై పెరగడం మాత్రం ఖాయం.
రిఫరెండంలో బ్రిటన్ వాసులు బ్రెగ్జిట్ వైపు మొగ్గు చూపితే కష్టాలు కోరి తెచ్చికున్నట్లే అవుతుందని బ్రిటన్ ప్రధాని డెవిడ్ కామెరూన్ ముందు రోజు చెప్పిన సంగతి తెలిసిందే. బ్రెగ్జిట్కు అనుకూలంగా బ్రిటన్ ప్రజలు ఓటేయడం బ్రిటన్ వాసులు తీసుకున్న చారిత్రక నిర్ణయమని బ్రిటన్ వైదొలగాలని గట్టి ప్రచారం చేసి ప్రజల్లో సెంటిమెంటును నింపిన నైజిల్ ఫరాగే పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో తన ఓటమిని అంగీకరించి ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా చేయాలని కోరడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు శుక్రవారం ఉదయం 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30) యూరోపియన్ పార్లమెంట్ నేతలు సమావేశం కానున్నారు.
బ్రెగ్జిట్ ఎఫెక్ట్, తిరుగులేని దెబ్బ: కామెరూన్ రాజీనామా!
ఈ సమావేశ అనంతరం యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ రెఫరెండం ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తరువాత ఉదయం 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు) యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లౌడీ జుంకర్, యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ స్కుల్జ్, డచ్ ప్రధాని మార్క్ రుట్టీ, ఈయూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారు.
కాగా, కూటమిలో ప్రధాన దేశమైన బ్రిటన్ యూనియన్ నుంచి వైదొలగితే దాని ప్రభావం ఈయూ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఈ విషయమై యూనియన్ ప్రధానంగా చర్చించనుంది. బ్రిటన్ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూనే, బ్రిటన్ వైదొలగిన నేపథ్యంలో ఏర్పడే సమస్యలపై యూనియన్ను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ఈయూ నుంచి బ్రిటన్ ఔట్: విడిపోదామన్న మెజార్టీ ప్రజలు, ట్రేడింగ్ నిలిపివేసిన జపాన్
బ్రిటన్ ప్రజలు తీసుకున్న నిర్ణయంపై ఈయూలోని మిగతా 27 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు లక్సెంబర్గ్లో జరుగుతుంది. ఈ సమావేశానికి జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం తదితర దేశాలకు చెందిన నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఇదే సమయంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేలు బెర్లిన్లో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తారు.
నిజానికి ఈయూలోని 28 దేశాల వార్షిక బడ్జెట్ 145 బలియన్ డాలర్లు. ఇందులో బ్రిటన్ వాటా 7 బిలియన్ డాలర్లు. బ్రిటన్ వైదలొగడం వల్ల ఈయూ లోటు బడ్జెట్లోకి వెళ్లిపోతుంది. ఇందుకు కారణం ఈయూ ఖాతాల్లోకి బ్రిటన్ నిధులు రావు. తాజా నిర్ణయంతో ఈయూ తరుపున బ్రిటన్లో వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.
కొత్తగా 'యూకే - ఈయూ' అంటూ అడ్డుగోడ ఏర్పడుతుంది. ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి పెను విఘాతం. ముందనుకున్న ఒప్పందం మేరకు వచ్చే సంవత్సరం జూలై నుంచి ఈయూ మినిస్టీరియల్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలు బ్రిటన్కు అప్పగించాల్సి ఉంది. కానీ ఇప్పుడు బ్రిటన్ వైదొలగడంతో ఈ బాధ్యతలు ఈస్టోనియా, మాల్టా లేదా క్రొయేషియాకు దక్క అవకాశం ఉంది.