కరోనా షాకింగ్: ప్రార్థనలతో తగ్గుతుందా?.. అమెరికాలో కొవిడ్ రోగులపై స్టడీ.. తెలుగు డాక్టర్ వెరైటీ..
నెలన్నరగా స్తంభించిన ప్రపంచం ఇప్పుడిప్పుడే మెల్లగా కదులుతోంది. కరోనా మహమ్మారి ఎంతకీ అదుపులోకి రాకపోవడం, వ్యాక్సిన్ కూడా ఇప్పట్లో రాదని తేలడంతో ఆయా దేశాలు సాహసం చేయకతప్పడంలేదు. వైరస్ రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఒక్కో దేశం లాక్డౌన్ ఎగ్జిట్ ప్రకటనలు చేస్తున్నాయి. సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 రోగుల సంఖ్య 36లక్షలకు పెరిగింది. అందులో 11.6లక్షల మందికి వ్యాధి నయమైపోగా, దాదాపు 2.5లక్షల మంది మరణించారు.
దేవుడున్నాడా?
ప్రాణనష్టంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ కుదిపేసిన ఈ విలయకాలంలో అన్ని మతాల బహిరంగ ఆరాధనల్ని కూడా నిషేధించడం తెలిసిందే. మరి, అదే దైవశక్తి మనల్నిప్పుడు కాపాడుతుందా? కరోనా గండం నుంచి మనవాళిని దేవుడు కాపాడుతాడా? అనే ప్రశ్నలకు సమాధానాల వెతుకులాట మొదలైంది. కరోనా విలయానికి కారణం మీరంటే మీరంటూ చైనా-అమెరికాల చేస్తోన్న చిల్లర పోరాటాన్ని కాసేపు పక్కనపెడితే, వైరస్ పుట్టినప్పటి నుంచి చాలా మందిలో అదోరకమైన చింతన, వేదన, మానవాళి దిక్కులేని స్థితిలోకి దిగజారిపోయిందనే భావన ప్రస్పుటంగా కనిపించాయి. నిజంగా ఈ ప్రకృతిని శాసించే సూపర్ పవరంటూ ఉంటే.. అది మనుషుల ప్రార్థనల్ని ఆలకిస్తుందికదా? ఈ విలయం నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది కదా? అని ఆశాభావం వ్యక్తం చేస్తారు డాక్టర్ ధనుంజయ లక్కిరెడ్డి.
1000 మంది రోగులపై స్టడీ..
అమెరికాలోని కాన్సాస్ సిటీలోగల ప్రఖ్యాత ‘హార్ట్ రిధమ్ ఇన్స్టిట్యూట్'లో సేవలందిస్తోన్న డాక్టర్ ధనుంజయ లక్కిరెడ్డి ఎన్నారైలలో చాలా ఫేమస్. ఆయన ఆధ్వర్యంలో కరోనాపై వినూత్న అధ్యయనం గత శుక్రవారమే ప్రారంభమైంది. ‘‘కరోనా కట్టడిలో ప్రార్థనల పాత్ర'' పేరుతో నాలుగు నెలల పాటు ఈ అధ్యయనం కొనసాగనుంది. ప్రార్థన అనే సాధనాన్ని మధ్యవర్తిగా వాడుకుంటూ కంటికి కనిపించని దైవశక్తితో సంభాషించడం, స్వస్థత పొందడం ఈ స్టడీలోని ముఖ్యాంశాలు. దీనికి సంబంధించిన నివేదికను అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్)కు కూడా అందజేసినట్లు లక్కిరెడ్డి చెప్పారు.
ఎలా చేస్తారంటే..
కొవిడ్-19 వ్యాధితో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న పేషెంట్ల నుంచి ప్రార్థనలపై నమ్మకముంచి ముందుకొచ్చే ఓ 1000 మందిని గుర్తిస్తారు. ఆ తర్వాత వాళ్లనుంచి ర్యాండమ్ గా 500 మంది ఎంచుకుని, వాళ్ల కోసం భారీ ఎత్తున ప్రార్థనలు చేస్తారు. హిందూయిజం, బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం, యూదు మతం పద్ధతుల్లో ప్రార్థనలు కొనసాగుతాయి. ఈ తంతు జరుగుతున్నంత వరకూ ఆ 1000 మంది పేషెంట్లకు చికిత్స యధావిధిగానే కొనసాగుతూ ఉంటుంది. అయితే ప్రార్థనలు పొందుతోన్న 500 మంది ఎవరేది స్టడీ బృందానికి తప్ప మిగతా వాళ్లకు తెలియదు.
సైన్స్ వర్సెస్ సూపర్ పవర్
‘‘మనందరం సైన్స్ ను నమ్ముతాం. ఒక డాక్టర్ గా నేను మరింత బలంగా సైన్స్ ను విశ్వసిస్తాను. అయితే మనకు తెలియని ఫిఫ్త్ డైమెన్షనల్ శక్తేదో విశ్వాన్ని నడిపిస్తుంటుందని కూడా చాలా మంది నమ్ముతారు. ఆ కనిపించని శక్తి సాయం పొందడమే నా స్టడీ ముఖ్యఉద్దేశం. మొదట ఈ విషయాన్ని చెప్పినప్పుడు మా డాక్టర్ల బృందం భిన్నాభిప్రాయాల్ని వ్యక్తపర్చింది. చాలా మంది దీన్ని కొట్టిపారేయలేకోపోయారు. పైగా ఇందులో ఎవరి ప్రాణాలను రిస్కులో పెట్టడంలేదు. ట్రీట్మెంట్ యధావిధిగా కొనసాగిస్తూనే ప్రార్థనలు చేస్తున్నాం. అందుకే ఎన్ఐహెచ్ కూడా అనుమతించింది''అని డాక్టర్ లక్కి రెడ్డి చెప్పారు.
Recommended Video
ఇంతకీ ఎవరీయన?
అమెరికాలో నివసిస్తోన్న తెలుగు డాక్టర్లలో ధనుంజయ లక్కిరెడ్డి చాలా ఫేమస్. 1996లో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆయన, ప్రస్తుతం కన్సస్ సిటీలోని హార్ట్ రిధమ్ ఇన్స్టిట్యూట్లో ఎలక్ట్రో ఫిజియాలజీ విభాగం చీఫ్ డాక్టర్ గా సేవలందిస్తున్నారు. పుట్టుకతో హిందూ అయినప్పటికీ, కేథలిక్ స్కూళ్లలో చదివానని, జీవనప్రయాణంలో మసీదులు, బౌద్ధారామాలు, సినగాగ్లకు వెళ్లానని, ఫెయిత్ హీలింగ్ ద్వారా కొవిడ్-19 రోగులు కోలుకునేలా చేయొచ్చని నమ్ముతున్నట్లు డాక్టర్ తెలిపారు.