చైనా దుస్సాహసం: భారత బోర్డర్ సమీపంలో యుద్ధ సన్నాహాలు, లైవ్ ఫైర్ డ్రిల్స్
ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా.. ఆ వేడిని మరింత పెంచేసింది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. టిబెట్ భూభాగంలో లైవ్ ఫైర్ డ్రిల్స్ ప్రారంభించి మరో దుస్సాహాసానికి ఒడిగట్టింది.
బీజింగ్: ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా.. ఆ వేడిని మరింత పెంచేసింది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. టిబెట్ భూభాగంలో లైవ్ ఫైర్ డ్రిల్స్ ప్రారంభించి మరో దుస్సాహాసానికి ఒడిగట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను చైనా అధికార సెంట్రల్ టెలివిజన్ విడుదల చేసింది.
అత్యంత సమీపంలోనే..
ఈ లైవ్ డ్రిల్స్ ఎప్పుడు జరిగాయన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. ఈ ఫైర్ డ్రిల్స్లో చైనాకు చెందిన రెండు సైనిక దళాలు పాల్గొన్నాయని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇండియా, చైనాకు మధ్య ఉన్న వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంలోనే ఈ డ్రిల్స్ జరిగాయని తెలిపింది.
11గంటలపాటు...
బ్రహ్మపుత్రా నది వెనుకవైపు కనిపిస్తుండటంతో ఇది భారత్కు సమీపంలోనే జరిగినట్లు తెలుస్తోంది. యాంటీ ట్యాంక్ గ్రనేడ్లు, హోవిట్జర్ తుపాకులు తదితర ఆయుధాలను వాడుతూ.. లక్ష్యాలను పేల్చి వేయవచ్చన్న విషయమై 11గంటలపాటు ఈ డ్రిల్ జరిగినట్లు తెలుస్తోంది. కాగా, జులై 10న కూడా టిబెట్(భారత్కు సమీపంలోని ప్రాంతం)లో చైనా సైనిక దళాలు ఈ తరహా విన్యాసాలు చేసిన విషయం తెలిసిందే.
యుద్ధానికి సిద్ధమవుతోందా?: టిబెట్లో అడ్వాన్స్డ్ ట్యాంక్తో తీవ్ర కసరత్తులు
Recommended Video
వెనక్కి వెళితేనే చర్చలంటూ..
తాజాగా డొక్లామ్ సరిహద్దు నుంచి భారత భద్రతా దళాలు వెనక్కి వెళితేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు సాధ్యమవుతాయని, అప్పటి వరకు చైనాకు ఏమీ వినపడదని చైనా అధికారిక మీడియా తన కథనంలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య నలుగుతున్న డొక్లామ్ సరిహద్దు విషయంలో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇటీవల భారత విదేశాంగశాఖ ప్రతినిధి గోపాల్ భగ్లే చేసిన వ్యాఖ్యలకు గాను చైనా పత్రిక ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.
భారత్కు హెచ్చరిక
డొక్లామ్ సరిహద్దు నుంచి భారత భద్రతా దళాలు వెనక్కి వెళ్లే దాకా ఇరు దేశాల మధ్య ఎటువంటి చర్చలు ఉండవని స్పష్టం చేసింది. సరిహద్దులో నెలకొన్న సమస్యను శాంతియతంగా పరిష్కరించేందుకు చైనా ప్రయత్నిస్తోందని, కానీ భారత్ అందుకు ఏమాత్రం సుముఖంగా లేదని తప్పుడు ఆరోపణలు చేసింది. అంతేగాక, భారత దళాలు వెనక్కి వెళ్లకపోతే పరిస్థితులు ఇంకా దిగజారే అవకాశం ఉందని హెచ్చరించింది.
అదనపు బలగాలు
డొక్లామ్లో భారత్ దళాలు ఆక్రమణకు దిగాయనే విషయం వాళ్లకి బాగా తెలుసంటూ చైనా మీడియా తన కథనంలో అక్కసును వెళ్లగక్కింది. ఇది ఇలా ఉండగా, భారత్ ఇప్పటికే సిక్కిం సరిహద్దుకు అదనపు భద్రతా బలగాలను పంపించింది. సరిహద్దు నుంచి సైన్యం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని భారత్ గతంలోనే తేల్చి చెప్పింది. గత కొన్ని రోజులుగా డొక్లామ్ సరిహద్దు వివాదంపై భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.