Coronavirus:మిథనాల్ తీసుకుంటే కరోనా రాదనే వదంతులు 300 మంది ప్రాణాలను బలిగొన్నాయి..
ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. చైనా తర్వాత ముందువరుసలో నిలిచింది ఇరాన్ కావడం విశేషం. ఆ తర్వాత ఇటలీ మరణాల సంఖ్యలో మించిపోయింది. ఓ వైపు ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తుంటే మరోవైపు ప్రజలు తప్పుడు వదంతులను నమ్మి వాటిని పాటించి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఇరాన్లో చోటు చేసుకుంది.
మిథనాల్ విరుగుడు అని నమ్మి..
కరోనావైరస్ ఇరాన్ను కుదిపేస్తోందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో మృతి చెందారు, చెందుతున్నారు కూడా. ఇరాన్లో కరోనాకేసులు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కరోనావైరస్ రాకుండా ఉండాలంటే మిథనాల్ తీసుకుంటే సరిపోతుందనే వదంతులు రావడంతో అక్కడి ప్రజలు ఆ విషపూరితమైన మిథనాల్ను తీసుకుని మృతి చెందారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది మిథనాల్ సేవించి మృత్యువాత పడ్డారు. మరో వెయ్యికిపైగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఇరాన్లో ఆల్కహాల్ సేవించడంపై నిషేధం ఉంది. ఇరాన్ సోషల్ మీడియాలో మిథనాల్ కరోనావైరస్కు విరుగుడు అనే తప్పుడు వార్త షికారు చేయడంతో ఈ నష్టం సంభవించింది. ఇప్పటికే కరోనాకాటుకు ప్రజలు మృతి చెందుతుండగా... వారి ప్రాణాలు తీసేందుకు ఇలాంటి వదంతులు కూడా వస్తున్నాయన్న విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారని ఓస్లోలో పనిచేసే డాక్టర్ నట్ ఎరిక్ హోవ్డా చెబుతున్నారు. ఇరాన్లో మిథనాల్ సేవించి ఇంకా ఎక్కువమందే మృతి చెంది ఉంటారన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు.
కోవిడ్-19కు చికిత్స కనుగొనలేదు
కరోనావైరస్ సోకిన చాలామందిలో దగ్గు జలుబు, జ్వరంలాంటి లక్షణాలు కనిపిస్తాయని అది మూడు వారాల సమయాల్లో నయమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ వృద్ధుల్లో సోకితే మాత్రం వారికి అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను ఇది మరింత తీవ్రతరం చేసి న్యుమోనియాకు దారితీయొచ్చని లేదా మరణం వరకు తీసుకెళ్లొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను కబళించడమే కాకుండా ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. అంతేకాదు ప్రజలు బయటకు తిరగకుండా ఇళ్లకే పరిమితమయ్యేలా ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చేలా చేసింది. ఇప్పటి వరకు అయితే కోవిడ్-19కు ఎలాంటి చికిత్స కనుగొనలేదు. శాస్త్రవేత్తలు, వైద్యులు ఈ మహమ్మారిని జయించేందుకు మెడిసిన్స్ కనుగొనే ప్రయత్నాల్లో మునిగిపోయి ఉన్నారు.
ఆల్కహాల్ శానిటైజర్ కలిపి తీసుకుంటే కరోనా రాదని
ఇదిలా ఉంటే కరోనావైరస్ సోకిన బ్రిటీష్ టీచర్తో పాటు మరికొంతమందికి ఈ వ్యాధి నయమైందని ఇరాన్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. విస్కీ మరియు తేనె తీసుకోవడంతో ఇది నయమైందనే వార్త షికారు చేసింది. దీంతో ఆల్కహాల్తో పాటు శానిటైజర్ కలుపుకుని తాగితే తమ శరీరంలో ఉన్న వైరస్ చంపివేయబడుతుందని భావించి అపోహకు పోయి మృతి చెందారు. ఇప్పటి వరకు ఇరాన్లో 29వేల కరోనా వైరస్ కేసులు నిర్థారణ కాగా, 2200 మంది మృతి చెందారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అత్యధిక మరణాలు నమోదు చేసిన దేశంగా ఇరాన్ నిలిచింది.
మిథనాల్ సేవించడంతో చూపుకోల్పోయిన చిన్నారి
ఇరాన్లో చదువుకున్నవారు తక్కువగా ఉండటం, ఇటర్నెట్లో వస్తున్న వదంతులతో ఈ భారీ ప్రాణ నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కుజెస్తాన్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిథనాల్ తీసుకుని చాలామంది చనిపోగా మరికొంతమంది చికిత్స కోసం హాస్పిటల్స్కు పరుగులు తీస్తుండటం స్థానిక మీడియా ఆ దృశ్యాలను టెలికాస్ట్ చేసింది. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే... అభం శుభం తెలియని ఓ ఐదేళ్ల కుర్రాడికి మిథనాల్ ఇవ్వడంతో వెంటనే ఆ చిన్నారి తన చూపును కోల్పోయాడు.
మిథనాల్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు
ఇరాన్లో ఇథనాల్పై నిషేధం ఉండటంతో మిథనాల్ను కొన్ని డ్రింక్స్లో కలిపి అక్కడి వారి అమ్ముతుంటారు. కొన్ని సార్లు ఇది ఆల్కహాల్తో కలిపి అమ్ముతుంటారు. అయితే కొన్ని సార్లు నిల్వ ఉంచిన ఆల్కహాల్ను మిథనాల్ విషపూరితం చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఇదే జరిగిందని వైద్యులు చెబుతున్నారు. మిథనాల్ కలిపితే ఎలాంటి వాసన కానీ, కలిపిన డ్రింక్ టేస్ట్లో తేడా కనిపించదు. అందుకే మిథనాల్ వినియోగిస్తారు. అయితే ఇది తీవ్ర ఆరోగ్యసమస్యలకు దారితీయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మెదడును డ్యామేజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మిథనాల్ తీసుకోవడం వల్ల గుండెనొప్పి, నాసియా, హైపర్ వెంటిలేషన్,చూపుకోల్పోవడం వంటివి జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.