బ్రిటన్ ప్రధానిగా మళ్లీ కామెరూన్కే పట్టం: ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
లండన్: బ్రిటన్ ప్రధానిగా డేవిడ్ కామెరూన్ తిరిగి మళ్లీ ఆ పదవిని దక్కించుకోనున్నారు. ఈ మేరకు గురువారం జరిగిన ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ డేవిడ్ కామెరూనే విజయం సాధిస్తాయని స్పష్టం చేశాయి.
కన్జర్వేటివ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన ప్రత్యర్ధి పార్టీల కంటే చాలా ముందున్నట్లు ఎగ్జిట్ ఫలితాలు అంచనా వేశాయి. గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్లోని మొత్తం 650 స్ధానాలకు గురువారం ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే.

ఇందులో 316 స్ధానాలను డేవిడ్ కామెరూన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బ్రిటన్ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ 239 స్ధానాలకే పరిమితమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.
ఇది ఇలా ఉంటే, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలే రానున్నట్లు డేవిడ్ కామెరూన్ కేబినేట్లోని మంత్రి మైఖెల్ గోవ్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీలనూ సమాన దృష్టితో చూడాలన్న సూత్రాన్ని అనుసరించి రాణి ఎలిజబెత్ ఈసారి కూడా ఓటువేయలేదు.

అధికార కన్జర్వేటివ్, ప్రతిపక్ష లేబర్ పార్టీలు నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ పడినా చివరకు ఎగ్జిట్ పోల్స్ మాత్రం కన్జర్వేటివ్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆరు లక్షలకు పైగా భారతీయ ఓటర్లు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో తొలిసారి ఇన్పోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషిసునక్ పోటీపడ్డారు. పార్లమెంటు ఎన్నికలతో పాటే 290 కౌంటీలకు కూడా ఎన్నికలు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను రాణి ఎలిజబెత్ శుక్రవారం ప్రకటిస్తారు. మే 27న ఆమె ప్రసంగంతో కొత్త పార్లమెంటు ఏర్పాటు కానుంది.












Click it and Unblock the Notifications