అభ్యంతరకర ఎఫ్బీ పోస్టు: హిందూ గ్రామానికే నిప్పంటించారు
ఢాకా: బంగ్లాదేశ్లో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి.. ప్రొఫెట్ మహ్మద్పై సోషల్మీడియాలో అభ్యంతకర పోస్టు చేశాడనే నెపంతో ఆ వ్యక్తి ఉండే మొత్తం గ్రామానికే దుండగుల గుంపు నిప్పు అంటించింది.
వివరాల్లోకి వెళితే.. హిందూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెట్ మహ్మద్ను ఉద్దేశించి ఫేస్బుక్లో అభ్యంతకరంగా పోస్టు చేశాడు. ఆ పోస్టు కాస్తా వైరల్గా మారింది. దీంతో ఆగ్రహించిన కొందరు గుంపుగా వచ్చి.. పోస్టు చేసిన వ్యక్తి గ్రామానికి వెళ్లి ఊళ్లోని దాదాపు అన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు.
ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్లను వినియోగించారు.
కాగా, అప్పటికే గ్రామంలోని 30కి పైగా ఇళ్లు కాలిబూడిదయ్యాయి. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడంపై దాడికి పాల్పడిన గుంపులోని వ్యక్తులే రంగ్పూర్-దినాజ్పూర్ హైవేపై రాస్తారోకోకు దిగడం గమనార్హం. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.