ఆ డయాబెటిస్ డ్రగ్తో కరోనా తగ్గుతుందట- తాజా అధ్యయనంలో వెల్లడి
కరోనా సెకండ్ వేవ్లో ఉత్పన్నమవుతున్న పలు శారీరక సమస్యలకు పరిష్కారాల్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన శాస్త్రవేత్తలు మరో కీలకమైన అంశాన్ని బయటపెట్టారు. కరోనాతో అల్లాడుతున్న రోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
రక్తంలో చక్కెర స్ధాయిల్ని తగ్గించేందుకు ప్రస్తుతం వాడుతున్న మెట్పార్మిన్ అనే డ్రగ్ను కోవిడ్ సార్స్ వైరస్కు విరుగుడుగా వాడొచ్చని కాలిఫోర్నియా యూనివర్శిటీ బృందం గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలను తాజా ఆన్లైన్ మెడికల్ జర్నల్ ఇమ్యూనిటీలో ప్రచురించారు. ఇందులో గుర్తించిన వివరాల ప్రకారం కోవిడ్ సోకిన వారిలో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారిపై మెట్ఫార్మిన్ చక్కగా పనిచేస్తన్నట్లు తెలిపారు. ఎలుకలపై వారు చేసిన పరిశోధనలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గినట్లు గుర్తించారు.
ప్రస్తుతం కరోనా సోకిన రోగుల్లో కనిపిస్తున్న ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్)ను తగ్గించేందుకు మెట్ఫార్మిన్ వాడొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సిండ్రోమ్ సోకిన వారి శరీలాల్లో ఉండే ప్రమాదకర రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల ఇన్ఫెక్షన్కు కారణమవుతాయని, అంతిమంగా శ్వాస సమస్యలకు కారణమై రోగి ప్రాణాల్ని హరించే ప్రమాదముంది. అలాగే శరీరంలోని అత్యవసర భాగాలకు ఆక్సిజన్ అందకుండా చేస్తాయని వారు తెలిపారు. తద్వారా రోగుల ప్రాణాలు పోతాయని వారు వెల్లడించారు. అలాంటి రోగులకు మెట్ఫార్మిన్ ఇవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్ను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.