భారత్-అమెరికా మధ్య కరోనా చిచ్చు:ఆ డ్రగ్ పంపించకపోతే ప్రతీకారం తీర్చుకుంటాం:మోడీకి ట్రంప్ వార్నింగ్
న్యూయార్క్: భయానక కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అల్లకల్లోలానికి గురి చేస్తోన్న నేపథ్యంలో.. పరిస్థితులను మెరుగుపర్చడానికి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీదే పూర్తిగా ఆధారపడ్డారు. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లొరోక్విన్ను తమకు సరఫరా చేయాలంటూ రెండురోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించిన ఆయన స్వరంలో మార్పు కనిపించింది.
ప్రతీకారం తప్పదని నేరుగా హెచ్చరిక
కరోనా వైరస్ వైద్య చికిత్సలో వినియోగించే ఈ హైడ్రాక్సిక్లొరోక్విన్ డ్రగ్ను వెంటనే తమ దేశానికి పంపించకపోతే.. ప్రతీకారం తప్పదని నేరుగా హెచ్చరించారు. తన అధికారిక నివాసం వైట్హౌస్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికాలో కరోనా వైరస్ భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోందని, ఈ వైరస్ మిగిల్చిన దుష్ప్రభావాలు, పరిణామాలు సుదీర్ఘకాలం పాటు ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దీన్ని నివారించడానికి చేయాల్సిందంతా చేస్తున్నామని అన్నారు.
కరోనా వైరస్ పేషెంట్లకు సరైన చికిత్స
హైడ్రాక్సిక్లొరోక్విన్ డ్రగ్తో కరోనా వైరస్ పేషెంట్లకు సరైన దిశలో వైద్యాన్ని అందించడానికి అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. హైడ్రాక్సిక్లొరోక్విన్ మిశ్రమాలతో ఆశించిన ఫలితాలు వస్తాయంటూ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిపుణులు స్పష్టం చేస్తన్నారని, తమ వద్ద ఈ డ్రగ్ పరిమితంగా ఉందని చెప్పారు. ఈ డ్రగ్ను తమ దేశానికి ఎగుమతి చేయాలని కోరుతూ భారత ప్రభుత్వాన్ని తాను ఇదివరకే విజ్ఙప్తి చేశానని గుర్తు చేశారు.
భారత ప్రధానమంత్రి సరఫరా చేయాలి
దీని కోసం తాను భారత ప్రధానమంత్రితో ఆదివారం నాడే ఫోన్లో మాట్లాడానని, ఇప్పటిదాకా తాను ఆశించిన ఫలితం ఏదీ రాలేదని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ బారిన పడ్డాయని, భారత్.. అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శిస్తోందని, దానికి ఆ దేశ ప్రధాని సారథ్యాన్ని వహిస్తున్నారని ప్రశంసించారు. హైడ్రాక్సిక్లొరోక్విన్ డ్రగ్ ఎగుమతి చేయడాన్ని భారత్ నిషేధించిందనే విషయం తన దృష్టిలో ఉందని, అయినప్పటికీ.. తమ అవసరాల దృష్ట్యా దాన్ని సరఫరా చేయాలని కోరినట్లు తెలిపారు.
Recommended Video
ప్రతీకారం ఉంటుందన్న డొనాల్డ్ ట్రంప్
రెండు రోజుల తరువాత కూడా భారత్ నుంచి తాను ఆశించిన సమాధానం రాలేదని చెప్పారు. అయినప్పటికీ.. ఫర్వాలేదని, దీనికి తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా భారత్ మధ్య దౌత్య సంబంధాలకు మించిన స్నేహబంధం ఉందని, ఈ రెండు దేశాల మధ్య స్నేహపూరక వాతావరణం ఉందని గుర్తు చేశారు. అయినప్పటికీ.. తాను ఆశించిన విధంగా భారత్ స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు.