కాంగోలో నౌక మునక: 129మంది మృతి
కాంగో: కాంగో ప్రజాస్వామ్య రిపబ్లిక్ (డిఆర్ కాంగో)లో తంగాన్యికా నదిలో నౌక మునిగి 129మంది దుర్మరణం చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ దుర్ఘటన వివరాలను ఆదివారం స్థానిక అధికారులు వెల్లడించారు.
నీట మునిగిపోయిన 129మంది మృత దేహాలను వెలికి తీసినట్టు తెలిపారు. ఈ సంఘటనలో 26మందే మరణించారని తెలిపిన స్థానిక ప్రభుత్వం నౌకలో ఉన్న అందరూ మరణించినట్టు ధ్రువీకరించింది. నౌక మునగిపోవడానికి అధిక బరువు కారణమని తెలుస్తోంది.
తరచూ ఇలాంటి ఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. లైఫ్ జాకెట్లు కూడా సరిగా లభ్యం కావని, దీంతో ఈత రాని వారు నీటిలో మునిగితే ప్రాణాలు కోల్పావాల్సిందేనని చెబుతున్నారు. నౌకలో మొత్తం 232మంది ఉన్నట్లు సమాచారం.
ఈజిప్టులో 13 మంది జాలర్ల మృతి
కైరో: గల్ఫ్ ఆఫ్ సూయజ్లో ఈజిప్టు జాలర్ల నౌకను కువైట్కు చెందిన కంటెయినర్ షిప్ ఢీకొన్న ఘటనలో 13 మంది జాలర్లు మృతిచెందగా, అనేక మందిని రక్షించారు.
కైరోకు దక్షిణాన 360 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ సూయజ్లోని రాయిస్ ఘారిబ్ ప్రాంతంలో సంఘటన చోటుచేసుకుంది. ఇటలీ ఓడరేవు నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వైపు వెళ్తున్న నౌక.. 40 మందితో వస్తున్న ఈజిప్టు జాలర్ల బోటును ఢీకొట్టింది.