Earthquake : ఫిజీ, టోంగా దేశాల్ని కుదిపేసిన భూకంపం- రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత
దక్షిణ పసిఫిక్ సముద్ర దీవుల్లో భాగమైన ఫిజీ, టోంగాల్ని ఇవాళ భూకంపం వణికించింది.ఇక్కడ భూకంపాలు సహజమే అయినా ఇవాళ అత్యంత తీవ్రతతో కూడిన భూకంపం రావడంతో జనం వణికిపోయారు. రిక్టర్ స్కేలుపై ఇది 6.8గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దీని తీవ్రత 5.3గా కూడా నమోదైనట్లు తెలుస్తోంది. అయితే భూకంప కేంద్రం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
ఫిజీతో పాటు టోంగా ద్వీపదేశాల్ని ఈ భూకంపం వణికించింది. స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఈ భూకంపం ఇరుదేశాల్ని వణికించింది. 330 దీవుల సముదాయమైన ఫిజీ దేశంలోని పశ్చిమ దీవుల్లో ఈ భూకంపం ప్రభావం ఎక్కువగా కనిపించింది. దీని పొరుగునే ఉన్న టోంగా దీవుల్లోనూ భూకంపం ప్రభావం కనిపించింది. దీంతో ఓ దశలో సునామీ హెచ్చరికలు కూడా చేసేలా కనిపించినా ఆ తర్వాత పరిస్ధితి శాంతించినట్లు తెలుస్తోంది.
దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో భూకంపాలు సహజమే అయినా ఇక్కడ అత్యంత తీవ్రతతో కూడిన భూకంపాలు వచ్చినప్పుడు సునామీ హెచ్చరికలు కూడా విడుదల చేస్తుంటారు. సముద్రం మధ్యలో ఉన్న దీవులు కావడంతో భూకంపాలతో పాటు సునామీ ప్రమాదం కూడా వీటికి పొంచి ఉంటుంది. గతంలో ఫిజీ దీవుల్లో ఇలాంటి హెచ్చరికలు పలుమార్లు విడుదల చేశారు కూడా. ఈసారి మాత్రం సునామీ స్ధాయిలో భూకంపం రాలేదని తెలుస్తోంది. దీంతో అక్కడి జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే భూకంపం ప్రభావంతో ఆస్తి నష్టం మాత్రం జరిగినట్లు సమాచారం.