ఊరేగింపులో ఏనుగుల బీభత్సం: తొక్కిసలాట..భక్తులకు గాయాలు!
కొలంబో: ఊరేగింపుగా వెళ్తోన్న రెండు ఏనుగులు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాయి. ఊరేగింపును ఆసక్తిగా తిలకిస్తున్న భక్తులపై పరుగులు తీశాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. వారిలో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన శ్రీలంక రాజధాని కొలంబోలో చోటు చేసుకుంది. కొలంబోలోని ఓ బౌద్ధాలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఊరేగింపును నిర్వహించారు. ఆధ్యాత్మిక పరమైన ఎలాంటి కార్యక్రమంలోనైనా ఏనుగులను ఊరేగించడం లంకేయుల సంప్రదాయం.
ఎంత తేడా? చంద్రయాన్-2 ఖర్చు రూ. 978 కోట్లు: వైట్ టాపింగ్ రోడ్ల వ్యయం రూ.986 కోట్లు!
ఈ సంప్రదాయాన్ని అనుసరించి.. ఆలయానికి చెందిన రెండు ఏనుగులను అలంకరించారు. ఊరేగింపుగా వీధుల్లోకి తీసుకెళ్లారు. ఏనుగులను నియంత్రించడానికి మావటిలు వాటిపై ఎక్కి కూర్చున్నారు. రాత్రివేళ ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో ఆ రెండు ఏనుగులూ ఒక్కసారిగా బెదిరిపోయాయి. భక్తులపై పరుగులు తీశాయి. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఊరేగింపును తిలకిస్తోన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
తలో దిక్కునకు చెదిరిపోయారు. ఏనుగుల దాడిలో కొందరు, తొక్కిసలాటలో మరికొందరు గాయపడ్డారు. సుమారు 17 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 13 మంది మహిళలు ఉన్నారు. ఓ ఏనుగు మీది నుంచి మావటి కిందపడటంతో ఆయన తలకు తీవ్రంగా గాయమైంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారందరికీ ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.
ఊరేగింపుల్లో పాల్గొనడం ఏనుగులకు కొత్తేమీ కాదు. ఆలయ కమిటీల పర్యవేక్షణలో ఉండే ఏనుగులు ఊరేగింపుల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి మావటిలు ఏనుగులకు ప్రత్యేకంగా శిక్షణ సైతం ఇస్తుంటారు. హార్మోన్ల ప్రభావం వల్ల తరచూ ఏనుగులు శారీరకమైన ఒత్తిళ్లకు గురవుతుంటాయని, అలాంటప్పుడే అవి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాయని జయంత జయవర్దనే అనే జంతు నిపుణుడు తెలిపారు.