ప్రధానిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి: రెండువారాలుగా మృత్యువుతో పోరాడి..కన్నుమూత
జొహాన్నెస్బర్గ్: కరోనా బారిన పడిన ప్రముఖుల మరణాలకు బ్రేక్ పడట్లేదు. అవి కొనసాగుతూనే వస్తున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారికి బలి అయ్యారు. కరోనా వైరస్ కేసుల్లో వేగం మందగించిందే తప్ప దాని తీవ్రత ఏ మాత్రం తగ్గలేదనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. కరోనా బారిన పడి ఏకంగా ఓ దేశ ప్రధానమంత్రే కన్నుమూశారు. రెండు వారాలుగా చికిత్స పొందుతున్నా ఆయన కోలుకోలేకపోయారు.
ఎస్వాతిని (స్వాజీలాండ్) ప్రధానమంత్రి ఆంబ్రోస్ ద్లామిని.. కరోనా బారిన పడి మరణించారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. నవంబర్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన ఆంబ్రోస్ కొద్దిరోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఆరోగ్యం కుదుటపడలేదు. దీనితో తొలుత తన దేశంలోని టాప్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి మరింత విషమించడంతో ఈ నెల 5వ తేదీన పొరుగునే ఉన్న దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణించిన విషయాన్ని ఎస్వాతిని ప్రభుత్వం ధృవీకరించింది. ఆంబ్రోస్ ద్లామిని కన్నుమూసినట్లు ఎస్వాతిని ఉప ప్రధానమంత్రి వెల్లడించారు. 2018లో ఆయన ఎస్వాతిని ప్రధానమంత్రిగా నియమితులు అయ్యారు. ఇదివరకు ఈ దేశాన్ని స్వాజీలాండ్గా పిలిచేవారు. ప్రస్తుతం ఇక్కడ 6,700లకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 127 మంది మరణించారు.
అరకొరగా వైద్య సదుపాయాలు ఉండటం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి చిన్న, పేద దేశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలకు అధునాతన వైద్య సదుపాయాలను కల్పిస్తోంది. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే.. ఆఫ్రికన్ కంట్రీల్లో కరోనా వైరస్ తీవ్రత కాస్త తక్కువే. మరణాల సంఖ్య కూడా పరిమితంగానే ఉంటోంది. కరోనా వైరస్ సోకిన అనంతరం పరిపాలనపైనే ఆంబ్రోస్ ద్లామిని దృష్టిని కేంద్రీకరించడం వల్ల ఆయన ఆరోగ్యం విషమించిందని ఎస్వాతిని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications