37 వేల అడుగుల ఎత్తులో విమానం-నిద్రపోయిన ఇద్దరు పైలట్లు-తర్వాత ఏం జరిగిందంటే ?
విమాన ప్రయాణాల్లో ప్రమాదాలు కొత్త కాదు. వాటిని నడుపుతున్న పైలట్లు అప్రమత్తంగా ఉండకపోయినా, గాల్లో పక్షులు ఢీకొట్టినా, ఎదురెదురుగా విమానాలు వచ్చినా .. ఇలా రకరకాల కారణాలతో ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఏకంగా పైలట్లు నిద్రపోతే .. ఏం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు ఊహించడమే కష్టం. అలాంటిదే ఓ ఘటన జరిగింది. కానీ విమానం ప్రమాదానికి మాత్రం గురికాలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
సూడాన్లోని ఖర్టౌమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా బయలుదేరిన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 'ఫ్లైట్ ET343' నడుపుతూ ఇద్దరు పైలెట్లు అలసిపోయి నిద్రపోయారు. ల్యాండింగ్ కు ఎయిర్ పోర్ట్ దగ్గరపడింది. అయినా పైలట్లు నిద్రలేవలేదు. ఫ్లైట్ ను ఆటోపైలట్ మోడ్ లో పెట్టేసి వీరిద్దరూ నిద్రపోయారు. దీంతో ఎయిర్పోర్ట్ సమీపిస్తున్న సమయంలో ఏటీసీ అప్రమత్తం చేసింది. అయినా పైలెట్లు నిద్రలేవలేదు.
చివరికి ఎయిర్పోర్ట్కు సమీపిస్తున్నా 37 వేల అడుగుల ఎత్తులోనే విమానం ప్రయాణిస్తుండడంతో అనుమానం వచ్చిన ఏటీసీ పైలెట్లను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం దక్కలేదు. పైలెట్లు విమానాన్ని 'ఆటోపైలెట్ సిస్టమ్'లో ఉంచడంతో విమానం సూచించిన ఎత్తులోనే ప్రయాణిస్తుంది. అయితే ల్యాండ్ అవ్వాల్సిన రన్వేను దాటిపోయిన తర్వాత 'ఆటోపైలెట్ సిస్టమ్' దానంతటదే ఆగిపోతుంది. ఈ విమానంలోనూ ఇదే జరిగింది. చివరికి 'అలారమ్' మోగడంతో వీరిద్దరూ నిద్రలేచారు.
హడావిడిగా నిద్రలేచి చూసుకుంటే ల్యాండ్ కావాల్సిన ఎయిర్ పోర్ట్ దాటేసింది. దీంతో వారు అధికారులతో సంప్రదించారు. చివరికి 25 నిమిషాల తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదే విషయాన్ని విమానయాన పర్యవేక్షణ సిస్టమ్ 'ఏడీఎస్-డీ' డేటా కూడా నిర్ధారించింది. విమానం ప్రయాణించిన మార్గం ఫొటోని కూడా విడుదల చేసింది. అడీస్ అబాబా ఎయిర్పోర్ట్ సమీపంలో విమానం గాల్లో రౌండ్లు కొట్టిన మార్గం ఫొటోలో కనిపిస్తోంది.