ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్గా భారత సంతతి గీతా గోపినాథ్, రెండో ఇండియన్
ఢిల్లీ: భారత సంతతి గీతా గోపినాథ్ను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థికవేత్తగా (చీఫ్ ఎకనమిస్ట్)గా నియమించింది. ఇప్పటి వరకు ఆ పదవిలో మౌరిస్ ఆబ్స్ట్ ఫెల్డ్ ఉన్నారు. ఆయన ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఈమె బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అనంతరం ఆ పదవిని చేపడుతున్న రెండో భారతీయ వ్యక్తి గీతా గోపినాథ్. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీఏ చేశారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ల నుంచి ఎంఏ చేశారు.
2018 నోబెల్ బహుమతులు: క్యాన్సర్పై పరిశోధనలకుగాను జేమ్స్, హోంజోలకు నోబెల్
2001లో ప్రిన్స్టన్కు విశ్వవిద్యాలయం నుంచి ఎకనమిక్స్లో పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత చికాగో విశ్వవిద్యాలయంలో పని చేశారు. విదేశీమారక ద్రవ్యం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు, ద్రవ్య విధానం, రుణాలు తదితర అంశాలపై దాదాపు నలభై వరకు పరిశోధన పత్రాలు రచించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తల్లో గీతా ఒకరు అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టైన్ లాగార్డే కితాబిచ్చారు. 2016లో ఆమెను కేరళ ఆర్థిక సలహాదారుగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నియమించారు. ఆమె నియామకాన్ని కొందరు వామపక్ష నేతలు ప్రశ్నించారు. 2017లో ఆమె యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి అవార్డు తీసుకున్నారు.
2014లో ఐఎంఎఫ్ గుర్తించిన 45 టాప్ ఆర్థికవేత్తల్లో ఈమె ర్యాంక్ 25. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2011లో గీతను యంగ్ గ్లోబల్ లీడర్గా గుర్తించింది. గీతా గోపినాథ్ భారత్లో జన్మించారు. ఇక్కడే పెరిగారు. ఆమె ఇప్పుడు అమెరికా సిటిజన్. అలాగే భారత్లో ఓవర్సీస్ సిటిజన్. గీతా గోపినాథ్ 1971లో కలకత్తాలో జన్మించారు.