H1B Visas: అమెరికా ఎన్నికల్లో కీలకంగా H1B వీసాలు.. ట్రంప్ గెలిస్తే ఎలా ఉంటుందంటే..
US elections: ఉన్నత చదువులు చదువుకుని అమెరికా వంటి దేశాల్లో గొప్ప ఉద్యోగం సాధించాలని భారతీయ యువత ఎక్కుగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం H1Bల ద్వారా వలస వీసాలు తీసుకుని అక్కడి IT కంపెనీల్లో రాణించేవారు ఎందరో ఉన్నారు. అదే మార్గంలో USలో సెటిల్ అవ్వాలని ఎందరో కలలు కంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఈ ఎన్నికలలో గెలిస్తే H1B వీసాలు మరియు భారతీయ వలసదారులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోననే సందేహం తలెత్తుతోంది.
ట్రంప్ అమెరికా పగ్గాలు చేపడితే మాత్రం H1B వీసా కార్యక్రమంలో పలు మార్పులు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇవి భారతీయ IT ఉద్యోగులపై అంతగా ప్రభావం చూపవని US-India స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ (USISPF) అధ్యక్షులు ముఖేష్ అఘి అభిప్రాయపడ్డారు. 'టెక్ ఉద్యోగులకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత నిబంధనలు సరైన స్థాయిలో IT ఉద్యోగుల సప్లైను పెంచలేకపోతున్నాయి. డెమోక్రాట్లు మరియు రిపబ్లికన్లు ఈ సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఆయా కంపెనీలను వేధిస్తుండటమే ఇందుకు కారణం' అని అఘి తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వలసదారుల సమస్యలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థులు మరియు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతీయ IT ఉద్యోగులపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ IT, బయోటెక్, కృత్రిమ మేధస్సు (AI) మరియు సైబర్సెక్యూరిటీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులుపై ఈ ప్రభావం అంతగా ఉండబోదని అఘి భావిస్తున్నారు. ఎందుకంటే ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ఉద్యోగులు మేలైన నైపుణ్యాలను కలిగి ఉంటారని, US కంపెనీల సామర్థ్యాన్ని పెంచుతారని వెల్లడించారు.
H-1B వీసా అనేది వలసదారులు అమెరికాలో పనిచేసేందుకు చట్టబద్ధమైన ఎంపిక అయినప్పటికీ, కొన్ని సంస్థలు దీన్ని దుర్వినియోగం చేస్తుండటంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒకే అభ్యర్థి కోసం అనేక దరఖాస్తులు, పరిమిత లాటరీ విధానం US వర్క్ఫోర్స్లోకి నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అమెరికా వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా లాటరీ పద్ధతిపై ఆధారపడి కాకుండా ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలం ఇదే పద్ధతిని అనుసరించడం ద్వారా సమస్యలు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత వీసా విధానాన్ని అమెరికా ఉద్యోగ అవసరాలకు అనుకూలంగా మార్చడం అవసరమని అఘి అంచనా వేశారు. భారతీయులకు వలస అనుమతులు ఇవ్వడం కోసం కొంత సమయం ఎక్కువగా తీసుకోవడం ఓ సమస్యగా మారిందన్నారు. ఇప్పటి పరిస్థితులలో H-1B ఉద్యోగి గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తే దశాబ్దాల వరకు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కోటా సిస్టమ్ని మార్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికాతో భారత్ సంబంధాలు ప్రధానంగా జియోపాలిటికల్, ఆర్థిక, మరియు వ్యక్తిగత సంబంధాలు అనే మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటాయన్నారు. ఇండియా గురించి నిర్ణయం తీసుకునే క్రమంలో వీటన్నిటి గురించి మరోసారి ఆలోచించాల్సి ఉంటుందని వివరించారు.












Click it and Unblock the Notifications