నేను రాను.. తాలిబాన్లు చంపిన ఇక్కడ ఉంటా.. పూజారీ మనోధైర్యం
ఆప్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఆటలకు హద్దే లేకుండా పోయాయి. వారిని అడిగే నాథుడు లేకపోయాడు. పైకి మహిళలను గౌరవిస్తాం.. అదీ, ఇదీ అని ఉపన్యాసాలు ఇస్తున్నారు.. కానీ వాస్తవం మాత్రం మేరు. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్ను అలా వీడాయో లేదో తాలిబన్లు విశ్వరూపం చూపిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లోని ముఖ్యమైన పట్టణాలను స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.
కాబూల్ కూడా వారి వశమైంది. తాలిబన్ల దూకుడు చూసిన ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సహా చాలా మంది కీలక నేతల దేశం విడిచి పారిపోయారు. ఇలాంటి సమయంలో కూడా ఆఫ్ఘనిస్థాన్ దాటి రావడానికి ఒక హిందూ పూజారి ససేమిరా అంటున్నాడు. రత్తన్ నాథ్ ఆలయంలో పండిట్ రాజేష్ కుమార్ కుటుంబం తరతరాలుగా పూజారులుగా పనిచేస్తున్నారు. పూర్వీకుల నుంచి వస్తోన్న ఈ ఆలయాన్ని వదిలి తాను రావడం జరగదని రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. కొంతమంది హిందువులు ఆయన్ను దేశం దాటించి, సాయం చేస్తామని చెప్పినా ఆయన నిరాకరించారట.
వందల ఏళ్లుగా పూర్వీకులు ఈ ఆలయంలో సేవ చేస్తున్నారు. కొందరు హిందువులు కాబూల్ వదిలి వెళ్లిపొమ్మన్నారు. వేరే చోటకు వెళ్లడానికి, అక్కడ ఉండటానికి సాయం చేస్తామని అన్నారు. కానీ ఈ ఆలయం మా వంశపారంపర్యంగా వస్తోంది. మేం ఇక్కడ వందల ఏళ్లుగా సేవలు చేస్తున్నామని చెప్పారు. అలాంటి ఆలయాన్ని వదల్లేనని.. తాలిబన్లు గనుక చంపేస్తే అది కూడా ఆలయానికి సేవగానే భావిస్తానని రాజేష్ బదులిచ్చారట.
పూజారి కథను భరద్వాజ్ అనే యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కథనంతోపాటు ఆ ఆలయానికి సంబంధించిన పాత వీడియోను కూడా షేర్ చేశారు. ఇతరుల దృష్టి ఆకర్షించకుండా ఉండటం కోసం రత్తన్ నాథ్ ఆలయం ఇల్లులాగే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాజేష్ కుమార్ కథ నెట్టింట్లో వైరల్ అవుతోంది.