ఆప్ఘన్ పౌరులకు ఆపన్నహస్తం-భారత్ కొత్త రకం వీసా-బ్రిటన్ పాస్ పోర్ట్ మినహాయింపు
ఆప్ఘనిస్దాన్ ను తాలిబన్లు ఆక్రమించి తమ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్దితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆ దేశం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు పౌరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో తమ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా ఎగిరే విమానంలో చోటు లేక రెక్కల్ని పట్టుకుని కాబూల్ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించి పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో భారత్, బ్రిటన్ సహా పలు దేశాలు ఆ దేశ పౌరుల్ని ఆదుకునేందుకు సిద్దమయ్యాయి.
ఆప్ఘన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలుకావడంతో రెండు దశాబ్దాలుగా అక్కడ ప్రశాంతంగా జీవించిన ప్రజలు కాస్తా బెంబేలెత్తుతున్నారు. తాలిబన్లు పెట్టే నిబంధనలు అమలు చేయలేకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో జనం దేశాన్ని వీడేందుకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆప్ఘనిస్తాన్ లో రోడ్తు, కాబూల్ విమానాశ్రయం రద్దీగా మారిపోయాయి. సాధ్యమైనంత త్వరగా ఆప్ఘనిస్తాన్ నుంచి బయటపడేందుకు వీలైనన్ని దారుల్ని జనం వెతుక్కుంటున్నారు. పాశ్చాత్య దేశాలు తమ పౌరుల్ని రక్షించందుకు రంగంలోకి దిగడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సైన్యాన్ని కూడా రంగంలోకి దింపుతున్నాయి. భారత్ కూడా ఇదే కోవలో తమ పౌరుల్ని వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ప్రపంచదేశాల ఆపన్న హస్తం
ఆప్ఘన్ లో తాలిబన్ల పాలన మొదలైందన్న సమాచారంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. వివిధ పనుల కోసం, అధికార విధుల నిర్వహణ కోసం ఆప్ఘనిస్తాన్ వెళ్లిన తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో వీరిని ఎలా ఆదుకోవాలనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే యూఎస్, బ్రిటన్ వంటి దేశాలు తమ సైన్యాల్ని రంగంలోకి దించడం ద్వారా అక్కడ చిక్కుకున్న తమ పౌరుల్ని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆప్ఘన్ లో చిక్కుకున్న విదేశీయుల భద్రతపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో వెనువెంటనే తీసుకోవాల్సిన చర్యలపై నాటో సహా ఇతర అంతర్జాతీయ సంస్ధలతో సంప్రదింపులు జరుపుతోంది.
ముప్పు లేదంటున్న తాలిబన్లు
ఆప్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోవాలనుకుంటున్న పౌరులకు ముప్పు తలపెట్టబోమని తాలిబన్లు పదే పదే హామీ ఇస్తున్నారు. తమ పాలనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్తున్నారు. అయినా అక్కడి ప్రజలకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. అలాగే విదేశీ ప్రభుత్వాలు సైతం తాలిబన్ల మాటలు నమ్మడం లేదు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చి తమ పౌరుల్ని పొట్టన పెట్టుకున్న చరిత్ర తాలిబన్లకు ఉందన్న విషయాన్ని ఆయా దేశాలు గుర్తు చేస్తున్నాయి. దీంతో తాలిబన్ల హామీలు ఎంతకాలం అమలవుతాయో తెలియక విదేశీ పౌరులు అల్లాడుతున్నారు.
కొత్త వీసా ప్రకటించిన భారత్
ఆప్ఘన్ లో చిక్కుకున్న అక్కడి పౌరులు భారత్ తిరిగి వచ్చేందుకు వీలుగా భారత్ కొత్త రకం వీసాను ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్ధితిల్లో భారత్ రావాలనుకుంటున్న ఆప్ఘన్ పౌరుల్ని వేగంగా అక్కడి నుంచి తరలించేందుకు ఈ వీసాను జారీ చేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఈ-ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసాగా పేర్కొంటున్న ఈ ఎలక్ట్రానిక్ వీసాను ఇక్కడి నుంచే జారీ చేస్తారు. వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అక్కడి పౌరులకు భారత అధికారులు సూచిస్తున్నారు. దీన్ని వెంటనే క్లియర్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆప్ఘన్ పౌరులు సాధ్యమైనంత త్వరగా ఇండియా చేరుకునేందుకు అవకాశం దక్కింది.
బ్రిటన్ పాస్ పోర్టు మినహాయింపు
ఆప్ఘన్ లో చిక్కుకున్న అక్కడి పౌరుల్ని ఆదుకునేందుకు భారత్ కొత్త రకం ఎలక్ట్రానిక్ వీసా ప్రకటిస్తే బ్రిటన్ ఏకంగా పాస్ పోర్టునే మినహాయింపు ఇచ్చేసింది. బ్రిటన్ లో ఆశ్రయం పొందాలనుకుుంటున్న ఆఫ్గన్ పౌరులకు ఇకపై పాస్ పోర్టు అక్కర్లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. పాస్ పోర్టు లేకుండా విమానాల్లో కానీ భూమార్గాల్లో కానీ బ్రిటన్ లోకి ఆఫ్ఘన్ పౌరుల్ని అనుమతిస్తాని వెల్లడించింది. ఇన్నాళ్లూ ఆప్ఘన్ లో తిష్ట వేసిన బ్రిటన్ ఇప్పుడు అక్కడి పౌరుల్ని ఆదుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆప్ఘన్ పౌరుల్ని రక్షించేందుకు, అలాగే కాబూల్ లో చిక్కుకున్న తమ పౌరుల్ని కాపాడేందుకు బ్రిటన్ భారీ ఎత్తున సైన్యాన్ని కూడా పంపుతోంది. దీంతో సాధ్యమైనంత సులువుగా వీరిని తమ దేశానికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
ఇదే బాటలో మరికొన్ని దేశాలు
ఆప్ఘన్ లో చిక్కుకుపోయిన పౌరుల్ని తాలిబన్ల నుంచి కాపాడేందుకు భారత్, బ్రిటన్ వీసా, పాస్ పోర్టు మినహాయింపుల్ని ప్రకటించిన నేపథ్యంలో ఇతర దేశాలు కూడా ఇదే బాట పడుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఆప్ఘన్ లో పాగా వేసిన నాటో దేశాలతో పాటు ఇతర ముస్లిం దేశాల నుంచి కూడా ఆప్ఘన్ పౌరుల రక్షణకు ఆఫర్లు పెరుగుతున్నాయి. ఆప్ఘన్ పొరుగున ఉన్న దేశాలు కూడా ఇప్పుడు అక్కడి పౌరుల్ని ఆదుకునేందుకు, తమ దేశంలోకి విరివిగా అనుమతించేందుకు నిబంధనలు సడలిస్తున్నాయి. ఆప్ఘన్ పౌరులకు అవసరమైన అన్నపానీయాలు అందించేందుకు కూడా వివిధ దేశాలు సిద్ధమవుతున్నాయి. కాబూల్ కు సైన్యాన్ని పంపడం ద్వారా యూఎస్, బ్రిటన్ తో పాటు నాటో బలగాల్ని మోహరిస్తూనే మరోవైపు అక్కడి పౌరులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో సిరియా వంటి దేశాల్లో నెలకొన్న పరిస్దితులతో పోలిస్తే ఆప్ఘన్ లో పరిస్దితులు మరీ దారుణంగా లేకపోయినా ప్రపంచ దేశాలు మాత్రం మానవతా దృక్పథంతో పౌరుల్ని ఆదుకునేందుకు సిద్ధం కావడం విశేషం. అదే సమయంలో తాలిబన్ల నుంచి కూడా వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో సహాయక చర్యలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు కలగడం లేదు.