బిగ్ న్యూస్: తోకముడిచిన చైనా సైన్యం.. లదాక్ నుంచి వెనక్కి.. మరోసారి కమాండర్ల చర్చలు..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత క్రమంగా తగ్గుతోంది. తూర్పు లదాక్ లోని మూడు కీలక పాయింట్లపై పట్టుబిగించిన చైనా సైన్యాలు.. ఎట్టకేలకు తోకముడిచాయి. భారత్ సైతం తన బలగాలను వెనక్కి రప్పిస్తున్నది. దీంతో నెల రోజులకుపైగా కొనసాగిన స్టాండాఫ్ ప్రక్రియ మెల్లగా బలహీనపడినట్లయింది. తద్వారా జనాభా, సైనిక, అణ్వాయుధ సంపత్తి పరంగా ప్రపంచంలోనే పెద్ద దేశాలైన తాము.. శాంతికే కట్టుబడి ఉంటామన్న రెండు దేశాల ప్రకటన కార్యరూపందాల్చినట్లయింది.
Recommended Video

మరోసారి చర్చలు..
లదాక్ లో ఉద్రిక్తతలు తొలిగిపోయేలా భారత్-చైనా సైనిక కమాండర్ల స్తాయిలో శనివారం చర్చలు జరగడం తెలిసిందే. నాటి సమావేశంలో.. రెండు దేశాలూ శాంతికే కట్టుబడి ఉండాలని, గత ఒప్పందాల ప్రకారమే నడుచుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. ఆ మేరకు సోమవారం నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. టెన్షన్ పూర్తిగా తొలగిపోయేలా బుధవారం మరోసారి ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్స్ మధ్య రెండో దఫా చర్చలు జరుగనున్నట్లు కేంద్ర ప్రభుత్వ టాప్ అధికారులు వెల్లడించారు.

ఆ మూడు పాయింట్లు..
దేప్పాంగ్ - గల్వాన్ లోయకు మధ్య భారత్ నిర్మించిన 255 కిలోమీటర్ల రోడ్డు.. ఒప్పందాలకు విరుద్ధమని వాదిస్తోన్న చైనా.. గడిచిన నెల రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ప్రధానంగా తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్, గాల్వాన్ లోయను చుట్టుముట్టిన డ్రాగన్ బలగాలు.. భారత సైనికులతో బాహాబాహీకి దిగాయి. మే మొదటి వారం నుంచే చైనా తన బలగాల తరలింపును, ఆయుధాల చేరవేతను ముమ్మరం చేయడంతో భారత్ సైతం చైనాకు సమాన స్థాయిలో సైన్యాన్ని సరిహద్దులో నిలబెట్టింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏ క్షణమైనా యుద్ధం రావొచ్చన్న ఊహాగానాల మధ్య చర్చలు ఫలవంతం కావడంతో ఇప్పుడు పరిస్థితి మారింది.

2.5కిలోమీటర్లు వెనక్కి..
లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి చర్చల్లో కుదిరిన అంగీకారాల మేరకు ఈస్ట్ లదాక్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుందని, ఇప్పటికే అవి లదాక్ సరిహద్దు నుంచి 2.5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లాయని కేంద్ర వర్గాలు తెలిపాయి. హాట్ స్ప్రింగ్స్ లోని 15వ పెట్రోలింగ్ పాయింట్, గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు వద్ద మంగళవారం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, కవ్వింపు చర్యల్లాంటివి కూడా చోటుచేసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. చైనా తన సైన్యాలను వెనక్కి తీసుకోవడంతో భారత్ కూడా ఇతర ప్రాంతాల నుంచి తరలించిన బలగాలను వెనక్కి పంపుతున్నట్లు తెలిపారు.

ఆక్రమణ నిజం కాదు..
ఎల్ఏసీ వెంబడి మూడు ప్రాంతాల కలిపి మొత్తం 60 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించినట్లుగా వచ్చిన వార్తలను కేంద్ర వర్గాలు ఖండించాయి. శాంతియుత పంథాలో ఇరు దేశాలూ సైన్యాలను వెనక్కి తీసుకుంటున్నాయని, ఆక్రమణపై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నాయి. కాగా, చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతున్నదో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు ఇంకొందరు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేయడం, ఆక్రమంలోనే భారత భూభాగం ఆక్రమణకు గురైందేమోనని అనుమానాలు వ్యక్తం చేయడం తెలిసిందే. దేశ సారభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత అంశాల్లో వెనుకడుగు వేయబోమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పలు మార్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications