డోన్ట్ బీ సైలెంట్: బ్రిటన్ మహిళా ఎంపీనీ వదల్లేదు: ఘాటుగా లేఖ రాసిన మోడీ సర్కార్
లండన్: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం..దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించి మూడు వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత చెలరేగుతోనే ఉంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రోజుల తరబడి అన్నదాతలు చేస్తోన్న ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు విదేశీ ప్రముఖులు రైతులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, మాజీ పోర్న్స్టార్ మియా ఖలీఫా, సామాజిక ఉద్యమకర్త గ్రెటా థెన్బర్గ్, బార్బెడస్ పాప్ సింగర్ రిహానా రైతులకు అండగా నిలిచారు. గ్రెటా థెన్బర్గ్ చేసిన టూల్కిట్ ట్వీట్.. దేశంలో అరెస్టుల పర్వానికి సైతం దారి తీసింది.
జగన్ను విప్లవవీరుడిగా అభివర్ణించిన చంద్రబాబు: టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాకు రెడీ
చూస్తూ కూర్చోవద్దు..
టూల్కిట్ వ్యవహారంలో ఇప్పటికే బెంగళూరుకు చెందిన 21 సంవత్సరాల సామాజిక కార్యకర్త దిశ రవి, నవ్దీప్ కౌర్ అరెస్ట్ అయ్యారు. ఈ ఎపిసోడ్లో మరిన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. దిశరవి, నవ్దీప్ కౌర్ విచారణ సందర్భంగా రాబట్టిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మరింతమందిని అదుపులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో నెలకొన్న ఈ పరిణామాల పట్ల బ్రిటన్ ఎంపీ క్లాడియా వెబ్బే ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని చూస్తూ కూర్చోవద్దంటూ ఆమె దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు.
మహిళా సామాజిక కార్యకర్తలపై అణచివేత..
దిశ రవి, నవ్దీప్ కౌర్ ఇద్దరూ మహిళలేనని, సామాజిక ఉద్యమకర్తలుగా భారత్లో గుర్తింపు పొందారంటూ క్లాడియా వెబ్బే పేర్కొన్నారు. రైతుల నిరసన ప్రదర్శనలు, ఆందోళనలకు శాంతియుతంగా మద్దతు పలికిన వారిద్దరినీ భారత ప్రభుత్వం అరెస్ట్ చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి అణచివేత చర్యలు స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడిదారీ విధానానికి, అధికారవాదానికి దారి తీస్తాయంటూ ఆమె ఆందోళన స్పష్టం చేశారు. ఇలాంటి పరిణామాలను చూస్తూ కూర్చోవద్దంటూ ఆమె సూచించారు.
ఏకపక్షం కాదు..
క్లాడియా ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆమెపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు బ్రిటన్లోని భారత హైకమిషన్ కార్యాలయం ఆమెకు ఓ బహిరంగ లేఖను రాసింది. వ్యవసాయ చట్టాలను తాము ఏకపక్షంగా రూపొందించలేదనే విషయాన్ని గుర్తు చేసింది. దేశ అత్యున్నత చట్టసభలో దానిపై చర్చించిన తరువాతే నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది. భారత్లో నివసించే వందకోట్ల మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాలకు రూపకల్పన చేసినట్లు వెల్లడించింది.
పరిష్కారానికి ఎంతో చేశాం..
ఈ చట్టాలపై రైతుల నుంచి వ్యతిరేకత తలెత్తడంతో వాటిని కార్యరూపంలోకి తీసుకుని రాలేదని పేర్కొంది. సమస్యను పరిష్కరించడానికి రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులతో 11 రౌండ్ల పాటు చర్చలు జరిపిన విషయాన్ని భారత హైకమిషన్ కార్యాలయంలో తన లేఖలో పొందుపరిచింది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో తాము రాజీపడబోమని, రైతుల ఉద్యమంతో సంబంధం లేని కొన్ని శక్తుల జోక్యాన్ని తాము సహించాలని అనుకోవట్లేదని భారత హైకమిషన్ పేర్కొంది.