లక్కీ ఫెలో: చిరుద్యోగికి రాత్రికి రాత్రే రూ.8 కోట్లు, దెబ్బతో దరిద్రం ఒదిలిపోయినట్లే!
అదృష్టం అంటే ఇలా ఉండాలి. నిన్నటి వరకు అతడో సాదాసీదా ఉద్యోగి. కానీ రాత్రికి రాత్రే అతడి జాతకం మారిపోయింది.
దుబాయ్: అదృష్టం అంటే ఇలా ఉండాలి. నిన్నటి వరకు అతడో సాదాసీదా ఉద్యోగి. కానీ రాత్రికి రాత్రే అతడి జాతకం మారిపోయింది. ఇన్నాళ్లూ అతడికి తలనొప్పిగా మారిన అప్పులు, ఆర్థిక ఇబ్బందులన్నీ ఇక కొట్టుకుపోయినట్లే!
ఈ లక్కీ ఫెలో పేరు కృష్ణంరాజు. దుబాయ్లోని రస్ అల్ఖైమాలో ఓ నిర్మాణ రంగ సంస్థలో 9 ఏళ్ల నుంచి చిరుద్యోగిగా ఉన్న కృష్ణంరాజు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. అతడికి ఏకంగా రూ.8.27 కోట్ల లాటరీ తగిలింది.
తాజాగా అబుదాబీలో వెలువడిన 'బిగ్ టికెట్ డ్రా'లో అతడిని వరించిందీ కోట్ల కొద్దీ డబ్బు! ఎప్పుడూ స్నేహితులతో కలిసి లాటరీ టికెట్ కొనేవాడినని, ఈసారి లక్కీగా ధరనంతా తానే భరించి టికెట్ కొన్నానని కృష్ణంరాజు మురిసిపోతున్నాడు.
మూడేళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇందుకు ప్రతినెలా సంపాదనలో కొంత డబ్బును పక్కన పెట్టేవాడినని చెప్పాడు. 'సంస్థ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చినప్పుడు నేను అస్సలు నమ్మలేదు. వాళ్లు ఫోన్ పెట్టేశాక.. ఆ సంస్థ వెబ్సైట్కు వెళ్లి చెక్ చేశా. అప్పటికి వాళ్లు దాన్ని అప్డేట్ చేయలేదు. ఒక అరగంట తర్వాత మళ్లీ చూశా..' అంటూ ఉద్వేగభరితుడయ్యాడు కృష్ణంరాజు.
'అప్పుడే నా పేరుతో వాళ్లు ఓ ట్వీట్ చేశారు. దాన్ని చూశాక నాకు ఆనందంతో గుండె ఆగినంత పనయింది. నేను విన్నర్గా సెలెక్ట్ అయ్యానని వెబ్సైట్లో చూశాకే మా వాళ్లకు విషయాన్ని చెప్పా. ఈ అరగంట వరకూ నేను టెన్షన్తో గడిపా..' అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం లాటరీలో గెలుచుకున్న డబ్బుతో ఏం చేయాలా అని తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నానని, ముందుగా తమకు ఉన్న అప్పుల్ని తీర్చేస్తానని, ఆ తర్వాత తన నాలుగేళ్ల కొడుకు కోసం కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, మిగిలిన డబ్బుతో ఏం చేయాలో ప్లాన్ చేస్తానని.. కృష్ణంరాజు చెబుతున్నాడు.