భార్యను పొడిచిన భారతీయుడికి జైలు శిక్ష
సింగపూర్: చిన్న విషయంలో సహనం కొల్పోయి కన్న బిడ్డల ముందు పబ్లిక్ గా మాల్ లో భార్యను కత్తితో పొడిచిన భారతీయ సంతతి భర్తకు సింగపూర్ న్యాయస్థానం 10 నెలలు జైలు శిక్ష విదించింది. పండుగ రోజు భార్యను కావాలని పిలుచుకుని వెళ్లి కత్తి తో పొడిచాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
సింగపూర్ లో భారతీయ సంతతికి చెందిన సురేష్ డేవిడ్ నరసింహులు(29), వంసత కుమారి(30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మనస్పర్థలు రావడంతో నరసింహులు, వసంతకుమారి దంపతులు విడిపోయి వేరు వేరుగా నివాసం ఉంటున్నారు.
గత దిపావళి పండుగ రోజు దంపతులు ఇద్దరు పిల్లలను బయటకు తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. తరువాత లిటిల్ ఇండియా రోడ్డులోని రేస్ కోర్స్ రోడ్డులోని షాపింగ్ మాల్ లోకి వెళ్లారు. షాపింగ్ చేస్తున్న సమయంలో నరిసింహులు, వసంతకుమారి దంపతుల మధ్య వాగ్వివాదం జరిగింది.
ఆ సమయంలో సహనం కొల్పోయిన నరసింహులు జేబులో ఉన్న కత్తి తీసుకుని భార్య కడుపులో పోడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వసంతకుమారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నరసింహులను కోర్టు ముందు హాజరు పరిచారు. నరసింహులు నేరం చేశాడని రుజువు కావడంతో 10 నెలలు జైలు శిక్ష విదించారు.