ట్రంప్ కు అరెస్ట్ వారెంటే జారీ చేసిన ఇరాన్- రెడ్ నోటీసు ఇవ్వాలని ఇంటర్ పోల్ కు వినతి...
ఈ ఏడాది బాగ్దాద్ లో తమ సైన్యాధిపతి జనరల్ సులేమానీని డ్రోన్ దాడితో హతమార్చిన అమెరికాపై ఇరాన్ కోపం ఇంకా చల్లారలేదు. సులేమానీ హత్యకు దేశం ప్రతీకారం తీర్చుకుంటుందని గతంలోనే ప్రకటించిన ఇరాన్ అధినేత ఖొమైనీ అన్నట్లుగానే తీవ్ర చర్యకు దిగారు. సులేమానీ హత్యకు ఆదేశాలు ఇచ్చిన అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు ఇరాన్ తరఫున వారెంట్ జారీ చేశారు. ట్రంప్ అరెస్టుకు సహకరించాలంటూ ఇంటర్ పోల్ ను ఇరాన్ అభ్యర్ధించింది.
Recommended Video
జనవరి 3న జరిగిన డ్రోన్ దాడికి బాధ్యులుగా ట్రంప్ తో పాటు మరో 30 మందికి అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్ ఖాసిమెహ్ర్ ప్రకటించారు. సులేమానీ హత్య నిందితులపై హత్య, ఉగ్రవాద సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా తమ పోరు కొనసాగుతుందని ఇరాన్ తాజాగా చేసిన ప్రకటన ఆ దేశంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడిపైనే అరెస్టు వారెంట్ జారీ చేసిన ఇరాన్.. రెడ్ నోటీసు ఇవ్వాలని ఇంటర్ పోల్ ను కోరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇది కలకలం రేపుతోంది. అయితే ఇరాన్ అరెస్టు వారెంట్ తో పాటు రెడ్ నోటీసు అభ్యర్ధనపై వెంటనే స్పందించేందుకు ఇంటర్ పోల్ నిరాకరించింది. ఇరాన్ తాజా చర్యపై ఇంటర్ పోల్ అధికారులు వేచి చూసే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది.