జాగ్రత్త: రేపు.. ఈ ఏడాదిలోనే అత్యంత ప్రమాదకరమైన రోజు... హెచ్చరిస్తున్న జ్యోతిష్యులు!
న్యూయార్క్: పాశ్చాత్య జ్యోతిష్యులు బాంబు పేల్చారు. రేపు.. అంటే డిసెంబర్ 21.. ఈ ఏడాదిలోనే అత్యంత దుర్దినమట. 'ఆ రోజు ఏ పని మొదలుపెట్టినా అంతేసంగతులు.. జాగ్రత్త'.. అని హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు, డిసెంబర్ 21న ఏ పని మొదలుపెట్టినా, ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా.. దాని ప్రభావం 2018లో కూడా ఉంటుందట. ఇదంతా వింటుంటే 2017 ఏడాది వెళ్తూ.. వెళ్తూ.. ఓ భయంకరమైన రోజును మనపై రుద్ది వెళ్లిపోతోందనే అనిపిస్తోంది.
నిజానికి ఈ ఏడాదిలోనే అతి తక్కువ పగటి కాలం డిసెంబర్ 21న నమోదవుతుందట. అయితే ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ 350 ఏళ్లలో మొదటిసారిగా సూర్యుడు, శని ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నారట.
ఇదే ప్రళయ సంకేతమని నీల్ స్పెన్సర్ అనే జ్యోతిష్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీ.శ.1664 తర్వాత అలాంటి ఖగోళ మార్పు మళ్లీ ఇన్ని వేల సంవత్సరాల తరువాత డిసెంబర్ 21 గురువారం సంభవిస్తుందని వివరిస్తున్నారు.
'వ్యక్తుల జాతకంలో శని మకరంలో ప్రవేశిస్తే లాభదాయకమే! కానీ ఖగోళపరంగా స్థూల స్థాయిలో ఇది ప్రమాదకరమైన విషయం! ప్రళయ కారకం కూడా..!' అని స్పెన్సర్ పేర్కొన్నారు. అంతేకాదు, గురువారం ఏ కొత్త నిర్ణయాలు తీసుకోవద్దనీ అనేక ఆస్ట్రాలజీ వెబ్సైట్లు కూడా సూచిస్తున్నాయి.
'డిసెంబరు 21న పగటి వేళ తక్కువగా ఉంటుంది. అందరిలో శక్తి తక్కువగా ఉంటుంది. ఆ రోజు ఏ సమావేశాలకూ వెళ్లకండి. ఏ కొత్త పనులూ మొదలుపెట్టకండి. కాదని చేస్తే.. 2018లో కూడా ఇబ్బందులు వెంటాడుతాయి..' అని లునార్ లివింగ్ అనే వెబ్సైట్ హెచ్చరిస్తోంది.