షాకింగ్ : కరోనా టెస్టుల్లో లోపాలున్నాయా? లోతుగా చూస్తే విస్తుపోయే విషయాలు..
కోవిడ్-19 ఓ విచిత్రమైన వైరస్ అని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఏ లక్షణాలు కనిపించని వ్యక్తిలోనూ.. వైద్య పరీక్షల్లో వైరస్ బయటపడటం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. టెస్టింగ్ ప్రక్రియలో ఉన్న లోపాలు.. రెండు.. వ్యక్తిలో ఉన్న వైరస్ లోడ్. వైరస్ లోడ్ తక్కువగా ఉండే వ్యక్తిలో టెస్టులకు సైతం దాని ఆనవాళ్లు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సైంటిస్టులు కరోనా టెస్టులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని వందశాతం నమ్మలేమని అభిప్రాయపడుతున్నారు. టెస్టుల్లో నెగటివ్ వచ్చినవారిలోనూ వైరస్ లోడ్ ఉండే అవకాశం ఉందంటున్నారు.

టెస్టింగ్లో లోపాలున్నాయా..?
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైద్య పరీక్షల కోసం పీసీఆర్ టెక్నాలజీనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా మనిషి శ్లేష్మంలో వైరస్ నమూనాలను గుర్తించవచ్చు. అయితే ఈ టెస్టింగ్ విధానంలో వైరస్ ఆనవాళ్లు చిక్కుతాయా.. లేదా.. అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని మిన్నెసోటలోని మయో క్లినిక్లో పనిచేసే అంటువ్యాధుల నిపుణురాలు ప్రియా సంపత్ కుమార్ వెల్లడించారు. మనిషిలో ఎంత వైరస్ లోడ్ ఉంది.. స్వాబ్స్(శాంపిల్స్) సరిగా సేకరించారా లేదా.. రిపోర్ట్స్ కోసం పంపించే క్రమంలో ఎంతసేపు అది ట్రాన్స్పోర్ట్లో ఉంది.. వంటి విషయాలన్నీ టెస్టులపై ప్రభావం చూపిస్తాయన్నారు.

తప్పుడు నెగటివ్ ఫలితాలు..?
కరోనా వైరస్ వ్యాప్తి జరిగి 4 నెలలే గడుస్తుండటంతో.. దీనిపై చేస్తున్న పరిశోధనలు,అధ్యయనాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఆరంభంలో చైనాలో వచ్చిన రిపోర్ట్స్ను పరిశీలిస్తే... వైరస్ ఉన్న శాంపిల్స్లోనూ టెస్టింగ్ ఫలితాలు 60-70శాతమే ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయా కంపెనీలు రూపొందించిన టెస్టింగ్ కిట్స్ ద్వారా వస్తున్న ఫలితాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. 40 మిలియన్ల జనాభాలో.. కేవలం ఒక శాతం మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించినప్పటికీ.. అందులో 20వేల తప్పుడు ఫలితాలు(false negative results) వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు ప్రియా సంపత్ కుమార్ తెలిపారు. కాలిఫోర్నియా పరిశోధకుల అంచనా ప్రకారం మే నెల మధ్యలో కరోనా వ్యాప్తి 50శాతం మేర పెరగవచ్చునన్న అంచనాలు ఉన్నాయన్నారు.

శిక్షణ పొందిన నిపుణులు అవసరం..
శరీరంలో వైరస్ ఏ ప్రాంతంలో ఎక్కువగా లోడ్ అయి ఉందన్నది గుర్తించడం కూడా టెస్టింగ్స్కు సవాల్గా మారింది. సాధారణంగా నాసిక రంధ్రాల నుంచి సేకరించే స్వాబ్స్(నమూనాలు) ద్వారా ముక్కు వెనుక భాగం గొంతు పైభాగాన్ని కలిపే నాసోఫారింక్స్ను పరిశీలిస్తారు. అయితే ఈ టెస్టులు చేసేందుకు శిక్షణ పొందిన నిపుణులు అవసరం. ఈ టెస్టుల్లో సాధారణంగా పేషెంట్ దగ్గినప్పుడు వచ్చే కఫం లేదా ఊపిరితిత్తుల నుంచి తీసుకునే శ్లేష్మం శాంపిల్స్గా ఉపయోగిస్తారు. లేదా రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శాంపిల్స్ సేకరిస్తారు. టెస్టింగ్ ప్రక్రియ సరిగా లేకపోతే తప్పుడు రిపోర్టులు పెరిగే అవకాశం ఉంది.

ఇన్వేసివ్ ప్రక్రియపై డా.డానియెల్..
టెస్టింగ్ ప్రక్రియపై జాన్ హోప్కిన్స్ ఆసుపత్రిలో పనిచేసే డానియెల్ బ్రెనర్ అనే ఎమర్జెన్సీ ఫిజీషియన్ ఏఎఫ్పీతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల ఓ వ్యక్తి ఊపిరితిత్తుల నుంచి ఇన్వేసివ్ ప్రక్రియలో శాంపిల్స్ సేకరించి కోవిడ్ 19 టెస్ట్ నిర్వహించామన్నారు. అంతకుముందు అదే పేషెంట్కి ముక్కు నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా మూడుసార్లు నెగటివ్ వచ్చిందన్నారు. కానీ అతనిలో కోవిడ్ 19 లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పారు. దీంతో ఇన్వేసివ్ ప్రక్రియలో అతని శ్వాసనాళం కిందకు కెమెరాను పంపించి ఊపిరితిత్తులను పరీక్షించినట్టు చెప్పారు. లోపల ఒక ద్రవాన్ని స్ప్రే చేయడం ద్వారా,ఊపిరితిత్తుల్లో ఉండే స్రావాలు దాన్ని అంటుకున్నాయని.. ఆ శాంపిల్స్ను టెస్ట్ చేస్తే అప్పుడు పాజిటివ్గా తేలిందన్నారు.

సెరోలాజికల్ టెస్టుల పైనే ఆశలు..
క్లినికల్ డయాగ్నోసిస్లో వ్యాధిని నిర్దారించడంలో ఉండే అనిశ్చితి ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదని నిపుణులు చెబుతున్నారు. 'కరోనాకు చాలారోజుల వరకు టెస్టు అందుబాటులో లేదు. టెస్టు అందుబాటులోకి వచ్చి విస్తృతంగా ఉపయోగిస్తున్న తరుణంలో ప్రాథమిక సూత్రాలను విస్మరిస్తున్నాం.' అని ప్రియా సంపత్ కుమార్ అన్నారు. అమెరికా విషయాన్నే పరిశీలిస్తే.. మొదట్లో నెమ్మదిగా ఉన్న టెస్టులు ఆ తర్వాత ఊపందుకున్నాయి. టెస్టింగ్ కిట్ల ఉత్పత్తి పెరగడంతో ఇప్పటివరకు దాదాపు 2.5మిలియన్ల ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. అయితే నెగటివ్గా తేలినవాళ్లలో కొంతమంది ఇక తాము సేఫ్ అని తమ రొటీన్ లైఫ్లోకి వెళ్లడం.. ఇతరులతో కలవడం ఆందోళనకు గురిచేస్తోందని బ్రెనర్ అభిప్రాయపడ్డారు. అయితే వైరస్కు ప్రతిస్పందనగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాలను కనిపెట్టేందుకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సెరోలాజికల్ పరీక్షలపై కొంత నమ్మకం ఉందన్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో చాలాకాలం తర్వాత మళ్లీ వైరస్ ఉందో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చన్నారు. పీసీఆర్ విధానంలోనూ వైరస్ సోకినవారిని గుర్తిస్తున్నప్పటికీ.. శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందన రావడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందునా.. ఆ పరీక్షల్లో తప్పుడు ఫలితాలకు ఆస్కారం ఉందన్నారు. సెరోలాజిక్ టెస్టుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని.. అయితే అది ఎంతమేరకు ఫలితాలనిస్తుందో వేచి చూడాలని ప్రియా సంపత్ కుమార్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications