జీహాదీ జాన్ను చంపేశారు: ఐఎస్ఐఎస్
బీరూట్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాది జీహాదీ జాన్ ను అమెరికా సైన్యం హతమార్చినట్లు వచ్చిన వార్తలు నిజమే అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నాయకులు దృవీకరించారు. అతను 2014 నవంబర్ నెలలో అంతం అయ్యాడని బుధవారం ఐఎస్ఐఎస్ తెలిపింది.
సిరియాలోని రక్కా నగరంలో అమెరికా సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో జీహాదీ జాన్ చనిపోయాడని ఐఎస్ఐఎస్ వెల్లడించింది. డ్రోన్ దాడులు చేసి జీహాదీ జాన్ ను అంతం చేశామని గత సంవత్సరం నవంబర్ లో అమెరికా ప్రకటించింది.
అయితే అప్పుడు నోరు విప్పని ఐఎస్ఐఎస్ ఇప్పుడు జీహాదీ జాన్ అంతం అయ్యాడని ప్రపంచానికి తెలిపింది. 2014 నవంబర్ 12వ తేదిన అమెరికా సైన్యం జీహాదీ జాన్ ను అంతం చెయ్యాలని ప్లాన్ వేసింది.

రక్కా నగరంలో జీహాదీ జాన్ ప్రయాణిస్తున్న కారు మీద డ్రోన్ లతో దాడులు చేసింది. ఈ దాడిలో తీవ్రగాయాలైన జీహాదీ జాన్ సంఘటనా స్థలంలో మరణించాడు. జీహాదీ జాన్ పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి ముసుగు వేసుకుంటాడు.
అతను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పట్టుబడిన బందీల తలలు కిరాతకంగా నరికిన భయంకర దృశ్యాలను వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు. మహమ్మద్ ఎమ్ వాజి అలియాస్ జీహాదీ జాన్ కువైట్ లో ఇరాక్ సంతతి కుటుంబంలో జన్మించాడు.
1993లో జీహాదీ జాన్ కుటుంబం బ్రిటన్ కు వలస వెళ్లింది. మహమ్మద్ ఎమ్ వాజి కంప్యూటర్ ప్రోగామర్ గా ఉద్యోగం చేసేవాడు. తరువాత ఐఎస్ఐఎస్ లో చేరి తన పేరును జీహాదీ జాన్ గా మార్చుకుని అరాచకాలు చేశాడు.
అమెరికా, బ్రిటన్ తదితర దేశాల జర్నలిస్టులు, టూరిస్టులను పట్టుకుని అతి కిరాతకంగా తలలు నరికి ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు. అప్పటి నుంచి అమెరికా, బ్రిటన్ సైనిక దళాలు జీహాదీ జాన్ ను లక్షంగా చేసుకుని చివరికి అంతం చేశాయి.












Click it and Unblock the Notifications