సముద్రంలోకి ఫుకుషిమా అణువ్యర్ధాలు-జపాన్ వివాదాస్పద నిర్ణయం- చైనా ఫైర్
2011లో జపాన్ను తాకిన భారీ సునామీ జ్ఞాపకాలు ఆ దేశంతో పాటు ప్రపంచాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తుంటాయి. అప్పటి సునామీ సమయంలో నిండా మునిగిన ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ను తల్చుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఈ సునామీ వచ్చి పదేళ్లు ముగిశాక ఇప్పుడు జపాన్ ప్రభుత్వం ఈ ప్లాంట్లోని ట్యాంకుల్లో చేరిన సునామీ నీటిని సముద్రంలోకి శుద్ధి చేసి వదలాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కీలక నిర్ణయం
2011లో భారీ సునామీ కారణంగా జపాన్లోని ఫుకుషిమాలో ఉన్న అణువిద్యుత్ ప్లాంట్లోకి చేరిన నీటిని ఇప్పటివరకూ బయటకు తీయలేని పరిస్దితి. తాజాగా ఆ నీటిని శుద్ధిచేసి సముద్రంలోకి వదిలిపెట్టాలని జపాన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్ను పునరుద్దరించే ప్రక్రియలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి విమర్శలకు కారణమవుతోంది. వాస్తవానికి ఈ ప్రక్రియ ఎప్పుడో మొదలు కావాల్సి ఉన్నా వివాదాలు, అంతర్జాతీయ అణు విద్యుత్ సంస్ధ అనుమతుల కారణంగా తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు జపాన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
సముద్రంలోకి అణువ్యర్ధాలు విడిచేది ఇలా
సముద్రంలోకి అణు వ్యర్ధాలను నేరుగా విడిచిపెట్టే అవకాశం లేదు. అలా చేస్తే పర్యావరణానికి, సముద్రంలో జీవరాసులకు తీవ్ర ముప్పు తప్పదు. అసలు సముద్రంలోకి అణు వ్యర్దాలు వదిలిపెట్టాలంటే అంతర్జాతీయ అణు విద్యుత్ సంస్ధ ఐఏఈఏ అనుమతి కూడా తప్పనిసరి. ఐఏఈఏ అనుమతి లభించినా సముద్రంలోకి అణు వ్యర్దాలు పంపడంపై అంతర్జాతీయంగా విమర్శలు తప్పవు. అందుకే వీటిని శుద్ది చేసి సముద్రంలోకి పంపాలని జపాన్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కూడా అంత సులువు కాదు. ప్రస్తుతం మిలియన్ టన్నుల వ్యర్ధాలను శుద్దిచేసి సముద్రంలోకి పంపాలని జపాన్ తీసుకున్న నిర్ణయం అమలయ్యేందుకు చాలా ఏళ్లు పడుతుంది.
జపాన్ నిర్ణయంపై మండిపడ్డ చైనా
ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ నుంచి వ్యర్దాలను శుద్ధిచేసి సముద్రంలోకి విడిచిపెట్టాలని జపాన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జపాన్ నుంచి ప్రకటన రాగానే కొద్గి గంటల్లోనే స్పందించిన చైనా.. ఇదో బాధ్యతా రాహిత్య నిర్ణయంగా అభివర్ణించింది. దీనిపై జపాన్లోని స్దానిక మత్సకారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేడియో ధార్మికత కలిగిన నీటిని సముద్రంలోకి విడిచిపెడితే తమ జీవనోపాధి దెబ్బతింటుందని మత్సకారులు ఆందోళన చెందుతున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం శుద్ధిచేసిన నీటిని మాత్రమే తాము విడుదల చేస్తామని వారికి నచ్చజెబుతోంది.